జేఎన్‌యూలో ప్రధాని, హోంమంత్రిలపై నినాదాలు చేసినవారిపై వేటు!

జేఎన్‌యూలో ప్రధాని, హోంమంత్రిలపై నినాదాలు చేసినవారిపై వేటు!
 
* విశ్వవిద్యాలయాలు ఆలోచనలు కేంద్రాలు… ద్వేషపూరిత ప్రయోగశాలలు కారాదు!

ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌లకు 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు బెయిల్‌ నిరాకరించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో కొన్ని వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీలకు వ్యతిరేకంగా అభ్యంతరకర నినాదాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియో దృశ్యాలు వైరల్ కావడంతో యూనివర్శిటీ యంత్రాంగం స్పందించింది.

ఈ ఘటనపై ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వవిద్యాలయ యాజమాన్యం సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు కేంద్రాలుగా ఉండాలని,  ద్వేషపూరిత ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించబోమని  విశ్వవిద్యాలయం తేల్చి చెప్పింది.  ఇందులో పాల్గొన్న వారిని వెంటనే సస్పెన్షన్, బహిష్కరణ, శాశ్వత బహిష్కరణకు గురిచేయవచ్చని తెలుపుతూ  విశ్వవిద్యాలయం ఎక్స్ లో వరుస పోస్టులు చేసింది.

ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని,  గుర్తించిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాని విశ్వవిద్యాలయం తెలిపింది. “గౌరవనీయ ప్రధానమంత్రి, హోంమంత్రిలపై అభ్యంతరకరమైన నినాదాలు చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పరిపాలన ప్రతిజ్ఞ చేసింది. ఈ విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది” అని విశ్వవిద్యాలయం తెలిపింది.

హింసను ఖండిస్తూ ప్రతి ఏటా జనవరి 5న క్యాంపస్ లో జరిగే కార్యక్రమం స్వభావం ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ ల బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత మారిపోయిందని, ఆ తర్వాత కొంతమంది రెచ్చగొట్టే, అభ్యంతరకరమైన నినాదాలు చేశారని ఆరోపణలు వెలువడ్డాయి. బిజెపి జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనవాలా నిరసనకారులను “తుక్డే పర్యావరణ వ్యవస్థ”, “పట్టణ నక్సల్స్”లో భాగమని ఆరోపించారు. ఈ నినాదాలు క్యాంపస్‌లలో “భారత వ్యతిరేక ఆలోచన”ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించాయని ప్రదీప్ భండారి విమర్శించారు. 
యూనివర్సిటీ విద్యార్థిసంఘం మాజీ జాయింట్ సెక్రటరీ వైభవ్ మీనా ఈ సంఘటనను విమర్శించారు, ఇటువంటి నినాదాలు “విశ్వవిద్యాలయ విద్యా నైతికతను దెబ్బతీస్తాయని”, విద్యార్థుల గౌరవాన్ని తగ్గించాయని విచారం వ్యక్తం చేశారు.  ఢిల్లీ అల్లర్ల కేసులో ఆధారాలున్నాయి కాబట్టి నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదని వైభవ్ మీనా స్పష్టం చేశారు.
కాగా, యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు అదితి మిశ్రా మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జనవరి 5, 2020న క్యాంపస్‌లో జరిగిన హింసను ఖండిస్తూ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని, నిరసనలో లేవనెత్తిన నినాదాలన్నీ సైద్ధాంతికమైనవని, అవి ఎవరినీ వ్యక్తిగతంగా దాడి చేయవని, అవి ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు.