ఢిల్లీ మసీదు వద్ద రాళ్లతో దాడి.. ఐదుగురు పోలీసులకు గాయాలు

ఢిల్లీ మసీదు వద్ద రాళ్లతో దాడి.. ఐదుగురు పోలీసులకు గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం దగ్గర ఉన్న సయ్యద్‌ ఫయాజ్‌ ఇలాహీ మసీదు వద్ద బుధవారం ఉదయం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మసీదు ఆవరణలో ఆక్రమణలను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్‌ అధికారులు, పోలీస్‌ బృందాలపై 25-30 మంది స్థానికులు రాళ్లు విసిరారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

స్థానికులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. కాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే అధికారులు ఇవాళ ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు.  తుర్క్‌మాన్‌ గేట్ సమీపంలోని రామ్‌లీలా మైదానం ఏరియాలో ఆక్రమణలకు గురైన 39 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ అధికారులను అదేశించింది.

డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టిన క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది అధికారులు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అయితే కొందరు మాత్రం రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గాయపడ్డ పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మసీదు సమీపంలోని వంటశాల, డిస్పెన్సరీని ఆక్రమణలుగా న్యాయస్థానం ప్రకటించిందని వివరించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించినట్లు పోలీసులు వెల్లడించారు.

మరోవైపు పోలీసులపై దాడి చేయడంపై ఢిల్లీ హోంమంత్రి ఆశీశ్​ సూద్​ తీవ్రంగా ఖండించారు. “మసీద్​ ప్రాంగంణంలో వాణిజ్య భవనాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు చెప్పింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యను అడ్డుకోవడం సరైంది కాదు. ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.” అని చెప్పారు.