పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలుపాలన్న బ్రిటన్‌ ఎంపీ

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలుపాలన్న బ్రిటన్‌ ఎంపీ
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ తో సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేయాలని బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని తాను మూడు దశాబ్దాల క్రితమే చెప్పానని, ఆ పని 1992లో కశ్మీర్ పండిట్ల వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
జైపూర్‌లోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో సోమవారం నాడు జరిగిన హై-టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 1990 మొదట్లో కశ్మీర్ పండిట్లు వలసలు వెళ్తున్నప్పుడే తన వైఖరిని స్పష్టం చేసినట్టు చెప్పారు. కశ్మీర్‌ను పాకిస్థాన్‌ ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు.

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370వ అధికరణను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయడానికి చాలాకాలం ముందే 1992లో నేను ఈ విషయం ప్రస్తావించాను. కశ్మీర్ పండిట్లకు తీవ్రం అన్యాయం జరుగుతోందంటూ యూకేలో ఒక సమావేశం కూడా నిర్వహించాం. మతం, ఇతర కారణాలతో కశ్మీర్ పండిట్లు తమ పూర్వీకుల ఇళ్లు బలవంతంగా వదిలివెళ్లాల్సి రావడాన్ని ఖండించాం” అని బ్లాక్‌మన్ తెలిపారు.

జమ్మూకశ్మీర్‌‌లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని ఆయన పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలనీ తాను అనేకసార్లు సూచించానని చెప్పారు. కాగా, పహల్గాం ఉగ్రదాడిని కూడా బ్లాక్‌మన్ ఖండించారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు.

కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మొరుగపడటంతో అక్కడ శాంతి నెలకొందని తాము భావించినప్పటికీ పహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచ దేశాలు బాసటగా నిలబడటం ముఖ్యమని ఆయన చెప్పారు. భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య శత్రుత్వాల విరమణను బ్లాక్‌మన్ స్వాగతించినప్పటికీ, కాల్పుల విరమణ దుర్బలంగా ఉందని, పరిస్థితి మళ్లీ దిగజారిపోవచ్చని చెబుతూ, ఆత్మసంతృప్తి చెందవద్దని హెచ్చరించారు.

జూన్‌లో జరిగిన ఆపరేషన్ సిందూర్ గ్లోబల్ ఔట్రీచ్ కార్యక్రమంలో, బ్లాక్‌మన్ ఒక అడుగు ముందుకు వేసి, పాకిస్తాన్‌ను ‘విఫలమైన దేశం’గా అభివర్ణించి, దాని పౌర-సైనిక సమతుల్యతను ప్రశ్నించారు. దేశాన్ని దాని ప్రజాస్వామ్య సంస్థలు నడుపుతున్నాయా? లేదా దాని జనరల్స్ నడుపుతున్నారా? అనేది అస్పష్టంగా ఉందని, పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.