ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా (ఐఆర్ సిసి) అధికారిక డేటాను బేస్ చేసుకుని ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. మిస్సిస్సాగా కేంద్రంగా పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ కన్వర్ సెయిరా ప్రకారం కేవలం 2025 చివరి నాటికి సుమారు 10.53 లక్షల వర్క్ పర్మిట్లు గడువు ముగియనున్నాయి. అదే విధంగా 2026 సంవత్సరంలో మరో 9.27 లక్షల వర్క్ పర్మిట్లు ముగియబోతున్నాయి.
అంటే రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు రెండు మిలియన్ల మంది తాత్కాలిక నివాసితులు తమ చట్టబద్ధ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న మాట. సంబంధిత వ్యక్తి మరొక వీసా మార్గంలోకి మారకపోతే లేదా శాశ్వత నివాసం (పీఆర్) పొందకపోతే అతను లేదా ఆమె అవుట్-ఆఫ్-స్టేటస్ గా మారతారని సెయిరా వివరించారు.
గతంలో ఉన్న మార్గాలతో పోలిస్తే ఇటీవలి కాలంలో కెనడా తీసుకున్న విధాన మార్పులు వీటిని మరింత కఠినంగా మార్చాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తాత్కాలిక కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ నుంచి పీఆర్కు మారడం ఇప్పుడు చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారింది. 2025 చివరి త్రైమాసికంలోనే 2.91 లక్షలకు పైగా వర్క్ పర్మిట్లు గడువు ముగియనున్నాయి.
దానికి కొనసాగింపుగా 2026 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలోనే దాదాపు 3.15 లక్షల వర్క్ పర్మిట్లు ముగియనున్నాయని అంచనా. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్పైరీలను కెనడా ఇంతకు ముందు ఎప్పుడూ ఎదుర్కోలేదని సెయిరా పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే.. 2026 మధ్య నాటికి కెనడాలో చట్టబద్ధ హోదా లేకుండా నివసిస్తున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. అందులో సగం మంది భారతీయులే ఉండవచ్చని చెప్పారు.

More Stories
భారత్ లో జరిగే టి20 ప్రపంచకప్ కు బాంగ్లాదేశ్ దూరం!
వెనెజువెలాలో పరిస్థితుల పట్ల భారత్ ఆందోళన
అమెరికా బందీగా వెనెజువెలా అధ్యక్షుడు!