దేశ రక్షణ కోసం ఏమైనా చేస్తాం

దేశ రక్షణ కోసం ఏమైనా చేస్తాం
పాకిస్థాన్ ‘ఓ చెడ్డ పొరుగు దేశం’ అని, ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌‌లో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ‘మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఎవరూ మనకు చెప్పలేరు’ అని ఆపరేషన్ సిందూర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ స్పష్టం చేశారు. 
 
“కొన్నిసార్లు మన పక్కింటిలో చెడ్డవాళ్లు కూడా ఉంటారు… దురదృష్టవశాత్తూ మన దేశానికి అలాంటి పరిస్థితి ఎదురైంది. పశ్చిమాన ఉన్న దేశాన్ని చూసినప్పుడు అది ఉద్దేశపూర్వకంగా, నిరంతరం, పశ్చాత్తాపం లేకుండా ఉగ్రవాదాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటే దానిని నుంచి మన ప్రజలను కాపాడుకునే హక్కు మనకు ఉంది. ఆ హక్కును మనం తప్పకుండా వినియోగిస్తాం” అని తేల్చి చెప్పారు.
 
“ఆ హక్కును ఎలా వినియోగించుకోవాలనే నిర్ణయం మనది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో ఎవ్వరూ మనకు చెప్పలేరు. స్వీరక్షణ కోసం అవసరమైనది ఏదైనా మేము చేస్తాం”అని జైశంకర్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు.  ఇదే సయమంలో 1960 భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం గురించి కూడా విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. 
 
“చాలా సంవత్సరాల కిందట నీటి పంపకాలకు అంగీకరించాం. కానీ దశాబ్దాల పాటు ఉగ్రవాదం కొనసాగితే పొరుగువారితో మంచి సంబంధాలు ఉండవు. మంచి సంబంధాలు లేకపోతే వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మీరు పొందలేరు. దయచేసి మాకు నీళ్లు ఇవ్వండి.. కానీ నేను మాత్రం మీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తాను అని మీరు అనలేరు. అది పొంతన లేని విషయం” అని జైశంకర్ స్పష్టం చేశారు.

భారత్‌కు వివిధ రకాలైన చాలా మంది పొరుగువారు ఉన్నారని ఆయన చెప్పారు. “మనకు మంచి చేసే లేదా కనీసం హాని చేయని పొరుగువారు ఉంటే, ఆ పొరుగువారి పట్ల దయతో ఉండటం, వారికి సహాయం చేయడం అనేది మన సహజ స్వభావం, ఒక దేశంగా మనం కూడా అదే చేస్తాం’” అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల జైశంకర్ మాట్లాడుతూ, దేశంలో చాలా వరకు సమస్యలు పాకిస్థాన్ సైన్యం నుండే పుట్టుకొస్తున్నాయని చెప్పారు.
 
 ‘వసుధైక కుటుంబకం’ గురించి ప్రస్తావిస్తూ వసుధైక కుటుంబకం అనే పదం ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ ప్రపంచాన్ని శత్రుభావంతో, ప్రతికూల భావనతో పరిగణించలేదని స్పష్టం చేశారు. అయితే ఇతరుల నుంచి ముప్పు వాటిల్లినప్పుడు, మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
అయితే భారత్ దౌత్యమార్గంలో సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటుందని తెలిపారు.   ఆఫ్గానిస్థాన్తో భారత్ దీర్ఘకాలిక నాగరికతా సంబంధాలు కలిగి ఉందని జైశంకర్ పునరుద్ఘాటించారు. కాలక్రమేణా ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.