ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ఔట్

ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ఔట్
* బంగ్లాలో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్​ రద్దయ్యే అవకాశం!

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనల ప్రభావం ఐపీఎల్ ఫ్రాంచైజీపై పడింది. ఇటీవలే మినీ వేలంలో భారీ ధరకు పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ ను కొనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ కు బీసీసీఐ కీలక ఆదేశాలిచ్చింది. బంగ్లాలో హిందువుల హత్యల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ 19వ సీజన్‌లో ఆడించవద్దని కోల్‌కతాకు స్పష్టం చేసింది. 

వెంటనే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను స్క్వాడ్ నుంచి తప్పించాలని షారుక్ ఖాన్ సహ యజమానిగా ఉన్న కేకేఆర్‌కు బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడడంపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. బంగ్లాలో హిందువులపై దాడులు, హత్యలను నిరసిస్తూ  ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్‌పై వేటు వేసింది బీసీసీఐ.

 ‘ఇటీవల బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్న బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్‌ను స్క్వాడ్‌ నుంచి తప్పించాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆదేశించింది. అతడి స్థానంలో మరొకరిని తీసుకునేందుకు అనుమతిస్తామని కోల్‌కతాకు చెప్పింది’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించాడు.

బంగ్లాదేశ్‌లో తాజాగా నెలకొన్న హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా ఆ దేశస్థుడైన ముస్తాఫిజుర్‌పై ఐపీఎల్‌లో వేటు వేయాలనే డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ముస్తాఫిజుర్‌ను వేలంలో కొనడంపై ఈమధ్యే ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ థాకూర్ మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున ఐపీఎల్‌లో ఆ దేశస్థుడిని ఆడించాలనకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ సహ- యజమాని షారుక్ ఖాన్‌ పై ఆయన విమర్శలు గుప్పించారు. దాంతో అతడిని ఐపీఎల్‌ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 19న అబుధాబీలో జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు కొన్నది. గతంలో పలు ఐపీఎల్ జట్లకు ఆడిన ముస్తాఫిజుర్ 60 మ్యాచుల్లో 65 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్(2024), ఢిల్లీ క్యాపిటల్స్(2022-23), రాజస్థాన్ రాయల్స్(2021), ముంబై ఇండియన్స్(2018) వంటి ఫ్రాంచైజీల జెర్సీతో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బరిలోకి దిగాడు.

మరోవంక, బంగ్లాదేశ్​లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంతో భారత్​ ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్​ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్​ను కోల్​కతా నైట్​రైడర్స్ తమ జట్టు నుంచి రిలీజ్ చేసింది. అయితే ఆ దేశ ఆటగాడిని ఐపీఎల్​లో ఆడేందుకు అనుమతించని బీసీసీఐ, మన ప్లేయర్లను బంగ్లాదేశ్​కు పంపే సాహసం చేస్తుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.

ఓవైపు ముస్తాఫిజుర్ ఐపీఎల్​లో ఆడడం గురించి వివాదం కొనసాగుతుండగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ ఏడాది భారత్​తో ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్​ను బీసీబీ ఖరారు చేస్తూ షెడ్యూల్ ప్రకటించింది. భారత్‌తో ఆగస్టు- సెప్టెంబరు మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్​ కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు బృందం ఆగస్టు చివరివారంలో బంగ్లాదేశ్‌లో పర్యటనకు వెళ్లాల్సి ఉంది.