మహారాష్ట్రలో 68 స్థానాలు ఏకగ్రీవంగా గెల్చుకున్న మహాయుతి

మహారాష్ట్రలో 68 స్థానాలు ఏకగ్రీవంగా గెల్చుకున్న మహాయుతి
జనవరి 15న జరగనున్న మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు, అధికార మహాయుతి  – భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఏక్‌నాథ్ షిండే శివసేన,  అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) – 64 స్థానాల్లో విజయం సాధించింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శుక్రవారం ప్రతిపక్ష అభ్యర్థులలో చాలా మంది తమ పేర్లను ఉపసంహరించుకోవడంతో, మహాకూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
మహాకూటమి భాగస్వాములలో, బీజేపీ అత్యధికంగా లబ్ధి పొందింది. దాని అభ్యర్థులలో 44 మంది ఏకగ్రీవంగా గెలుపొందారు. దీనితో పాటు, శివసేనకు చెందిన 21మంది అభ్యర్థులు, ఎన్‌సిపికి చెందిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్యాణ్-డోంబివ్లిలో 14 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భివండి, పన్వెల్, జల్గావ్‌లో కూడా బీజేపీ ఆరు స్థానాల చొప్పున విజయం సాధించింది. ధూలే, అహిల్యానగర్‌లో వరుసగా నలుగురు, ముగ్గురు బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
 
అంతేకాకుండా, పూణే, పింప్రి-చించ్వాడ్‌లో బీజేపీ అభ్యర్థులు రెండు స్థానాల చొప్పున గెలుచుకున్నారు. శివసేన విషయానికొస్తే, థానేలో దాని ఏడుగురు అభ్యర్థులు, కల్యాణ్-డోంబివ్లి, జల్గావ్‌లో ఆరుగురు చొప్పున ఏకగ్రీవంగా గెలుపొందారు. అహిల్యానగర్‌లో ఎన్‌సిపికి చెందిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా గెలిచారు. ఇది కాకుండా, మాలెగావ్‌లో ఒక స్థానిక ఇస్లామిక్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
64 స్థానాల్లో మహాకూటమి సాధించిన ఈ విజయం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అధికార కూటమి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గత నెలలో జరిగిన రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికలలో ఈ కూటమి ఘన విజయం సాధించిందని, 2024 అసెంబ్లీ ఎన్నికలలో విజయం తర్వాత మహారాష్ట్రలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని గమనించాలి. బీఎంసీతో సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ జరగనుంది. ఫలితాలను మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జనవరి 16న ప్రకటించనుంది.