అమెరికాలో ప్రయాణం అంటే భయపడుతున్న వలసదారులు 

అమెరికాలో ప్రయాణం అంటే భయపడుతున్న వలసదారులు 
 
జనవరితో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసలను నియంత్రించేందుకు చేపడుతున్న కఠినమైన నిబంధనల వల్ల భారతీయుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ హెచ్-1బీ వీసా నిపుణుల్లో రోజురోజుకు భయం, అనిశ్చితి పెరుగుతోంది.  వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇమ్మిగ్రేషన్ అధికారుల పరిశీలన పెరగడం వల్ల, చాలామంది వలసదారులు దేశీయంగా అయినా, అంతర్జాతీయంగా అయినా ప్రయాణించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అమెరికాను వదిలి వెళ్లేందుకు సాహసించడం లేదు.

న్యూయార్క్ టైమ్స్ తో కలిసి కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (కెఎఫ్ ఎఫ్) నిర్వహించిన 2025 సర్వే ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ ప్రకారం అమెరికాలో నివసిస్తున్న వలసదారుల్లో సుమారు 27శాతం మంది, అంటే ప్రతి పదిమందిలో ముగ్గురు ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిని ఆకర్షించకూడదనే ఉద్దేశంతో ప్రయాణాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడైంది.  చెల్లుబాలు అయ్యే పత్రాలు ఉన్నవారు కూడా ఈ భయానికి లోనవుతున్నారు. చట్టబద్ధంగా అమెరికాలో ఉన్న హెచ్-1బి వీసాదారుల్లో 32 శాతం మంది, సహజ పౌరుల్లో 15 శాతం మంది కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నట్లుగా సర్వే వెల్లడించింది. పత్రాలు లేని వలసదారుల్లో ఈ భయం మరింత తీవ్రంగా ఉంది.

థ్యాంక్స్ గివింగ్ నుంచి క్రిస్మస్, నూతన సంవత్సర కాలంలో లక్షలాదిమంది అమెరికన్లు ప్రయాణిస్తారు. కానీ ఈసారి అనేకమంది వలసదారులు ఇంటికే పరిమితమవుతున్నారు. దేశీయ విమాన ప్రయాణికుల సమాచారాన్ని కూడా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తో పంచుకుంటోందనే వార్తలు వలసదరుల్లో ఆందోళనను పెంచాయి.

ఫెడరల్ ఏజెన్సీల మధ్య ఈ డేటా భాగస్వామ్యం అరెస్టులు, నిర్బంధాలు, బహిష్కరణలకు సులభతరం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  రిమోట్ వీసా రిన్యూవల్స్ రద్దు, కొతత దరఖాస్తులపై భారీ ఫీజులు, సోషల్ మీడియా స్క్రీనింగ్ వంటి చర్యలు వీసాదారుల్లో అయోమయాన్ని సృష్టించాయి.  దీని ఫలితంగా కాన్సులేట్లతో ఇంటర్వ్యూలు భారీగా వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు, అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా హెచ్-1బి వీసాదారులకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నాయి.