ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే కుంభమేళా తరహాలోనే ఇప్పుడు కేరళలో కూడా కేరళ కుంభమేళా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జగద్గురు శంకరాచార్యులు జన్మించిన ఈ పవిత్ర భూమిలో చరిత్రలో తొలిసారిగా ఈ భారీ ఆధ్యాత్మిక వేడుక జరగబోతోంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ వంటి పుణ్యక్షేత్రాలలో జరిగే కుంభమేళా తరహాలోనే కేరళలో కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని జునా అఖారా (దేశంలోనే అతిపెద్ద సన్యాసుల విభాగం) నిర్ణయించింది.
2026 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కేరళ మలప్పురం జిల్లాలోని భారతపుళ నదీ తీరంలో ప్రసిద్ధ తిరునావాయ నవ ముకుంద ఆలయం ముందు ఈ కుంభమేళా వేడుకలను జరపనున్నారు. జునా అఖారా మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి తెలిపిన వివరాల ప్రకారం కేరళకు కుంభమేళా వంటి గొప్ప సంప్రదాయం గతంలోనే ఉందని పేర్కొన్నారు.
2026లో ప్రారంభమయ్యే ఈ కుంభమేళా వేడుకను 2038 నాటికి (తర్వాత 12 ఏళ్ల చక్రం పూర్తి అయ్యే సమయానికి) మరింత భారీ స్థాయిలో నిర్వహించాలని జునా అఖారా లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులోని కుంభకోణంలో కూడా ఇలాంటి మహామఖం వేడుక జరుగుతుందని, మఖం నక్షత్రం ప్రాముఖ్యతతో ఈ ఉత్సవాలు ముడిపడి ఉన్నాయని ఆనందవనం భారతి వివరించారు.
కేరళకు చెందిన , మహామండలేశ్వర్ హోదాను సాధించిన ఆ రాష్ట్రం నుండి కేవలం మూడవ వ్యక్తి అయిన స్వామి ఆనందవనం, సన్యాస జీవితాన్ని స్వీకరించడానికి ముందు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో అనుబంధం కలిగి ఉన్నారు. ఉత్తర భారతదేశంలోని కుంభమేళాల మాదిరిగానే కేరళ కూడా బలమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని పంచుకుంటుందని ఆయన తెలిపారు.

More Stories
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఉక్రెయిన్కు అమెరికా 15ఏళ్ల పాటు భద్రత హామీ
యూనస్ హయాంలో బంగ్లాలో దుర్భరంగా మహిళలు!