జనవరి 18 నుంచి కేరళలో తొలిసారి కుంభమేళా

జనవరి 18 నుంచి కేరళలో తొలిసారి కుంభమేళా

ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే కుంభమేళా తరహాలోనే ఇప్పుడు కేరళలో కూడా కేరళ కుంభమేళా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జగద్గురు శంకరాచార్యులు జన్మించిన ఈ పవిత్ర భూమిలో చరిత్రలో తొలిసారిగా ఈ భారీ ఆధ్యాత్మిక వేడుక జరగబోతోంది.  హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాలలో జరిగే కుంభమేళా తరహాలోనే కేరళలో కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని జునా అఖారా (దేశంలోనే అతిపెద్ద సన్యాసుల విభాగం) నిర్ణయించింది.

2026 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కేరళ మలప్పురం జిల్లాలోని భారతపుళ నదీ తీరంలో ప్రసిద్ధ తిరునావాయ నవ ముకుంద ఆలయం ముందు ఈ కుంభమేళా వేడుకలను జరపనున్నారు. జునా అఖారా మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి తెలిపిన వివరాల ప్రకారం కేరళకు కుంభమేళా వంటి గొప్ప సంప్రదాయం గతంలోనే ఉందని పేర్కొన్నారు.

పూర్వం చేరమాన్ పెరుమాళ్ రాజుల కాలంలో తిరునావాయలో మహామఖం అనే ఉత్సవం జరిగేదని, ఇది ఉత్తర భారత కుంభమేళాకు సమానమైనదని ఆయన వెల్లడించారు.  చేర రాజవంశం కాలంలో, మహా మఖం ఒక ప్రధాన ఆధ్యాత్మిక,  సామాజిక సమావేశ కేంద్రంగా ఉండేది. ఇక్కడ దార్శనికులు, పండితులు,  పాలకులు సనాతన ధర్మ సూత్రాలపై చర్చించడానికి సమావేశమయ్యేవారు.
 
“ఈ పండుగ సమయంలో, యజ్ఞాలు , యాగాలు నిర్వహించి, ఒక కొత్త రాజును ఎన్నుకునేవారు. చివరి పెరుమాళ్ అయిన సుందర మూర్తి పాలన తర్వాత, నాయకత్వం పెరుంపడప్పు స్వరూపానికి, ఆ తర్వాత వల్లువ కోనతిరికి సంక్రమించి, మరింత సైనిక రూపాన్ని సంతరించుకుంది,” అని ఆయన వివరించారు.   అప్పట్లో ఈ మహామఖం ఉత్సవం ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగేదని, అందులో పండితులు, రాజులు, యోధులు పాల్గొని సనాతన ధర్మం గురించి చర్చించేవారని ఆనందవనం భారతి తెలిపారు. 
చివరిగా ఈ సంప్రదాయాన్ని 2016లో పునరుద్ధరించే ప్రయత్నం మొదలైందని చెప్పారు.  దేశవ్యాప్తంగా జరిగే కుంభమేళాలను పర్యవేక్షించే జునా అఖారా ఈ వేడుకను కేరళలో నిర్వహిస్తోంది. కేరళలోని అన్ని ఆశ్రమాలు, మఠాధిపతులు ఇందులో భాగస్వాములు అవుతారు. ఈ వేడుకను విజయవంతం చేయడానికి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, మలబార్ దేవస్వం బోర్డుల సహకారాన్ని జునా అఖారా కోరనుంది.

2026లో ప్రారంభమయ్యే ఈ కుంభమేళా వేడుకను 2038 నాటికి (తర్వాత 12 ఏళ్ల చక్రం పూర్తి అయ్యే సమయానికి) మరింత భారీ స్థాయిలో నిర్వహించాలని జునా అఖారా లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులోని కుంభకోణంలో కూడా ఇలాంటి మహామఖం వేడుక జరుగుతుందని, మఖం నక్షత్రం ప్రాముఖ్యతతో ఈ ఉత్సవాలు ముడిపడి ఉన్నాయని ఆనందవనం భారతి వివరించారు.

కేరళకు చెందిన , మహామండలేశ్వర్ హోదాను సాధించిన ఆ రాష్ట్రం నుండి కేవలం మూడవ వ్యక్తి అయిన స్వామి ఆనందవనం, సన్యాస జీవితాన్ని స్వీకరించడానికి ముందు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)తో అనుబంధం కలిగి ఉన్నారు. ఉత్తర భారతదేశంలోని కుంభమేళాల మాదిరిగానే కేరళ కూడా బలమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని పంచుకుంటుందని ఆయన తెలిపారు.