బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిపై మూక దాడి, హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిపై మూక దాడి, హత్య
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న వేళ, రాజ్బరి జిల్లాలో 29 ఏళ్ల అమృత్ మండల్ అనే హిందూ యువకుడిని అల్లరిమూకలు దారుణంగా కొట్టి చంపడం సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో దుండగులు అమృత్‌ను ఇంట్లో నుండి వీధిలోకి ఈడ్చుకెళ్లి, అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఈ దాడి తీవ్రతకు ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 
 
దేశంలో నెలకొన్న అస్థిరతను అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలకు ఈ ఘటన మరొక నిదర్శనంగా నిలిచింది. డిసెంబర్‌ 24న రాత్రి 11 గంటల సమయంలో డబ్బుల వసూలు కోసం గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం ఇంటికి అనుచరులతో కలిసి సామ్రాట్ వెళ్లినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. 
 
ఆ కుటుంబం దొంగలని అరవడంతో స్థానికులు సామ్రాట్‌పై దాడి చేసినట్లు పేర్కొంది. ఇతర వ్యక్తులు పారిపోగా సహచరులలో ఒకరైన ఆయుధాలు కలిగిన మొహమ్మద్ సలీమ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆ మీడియా తెలిపింది.  అయితే, అతను అక్కడ హిందువులకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని, అతనిపై ఇప్పటికే మరో రెండు కేసులు నమోదై ఉన్నాయని చెబుతున్నారు. సరైన విచారణ లేకుండా, కేవలం అనుమానంతో లేదా ఆరోపణలతో గుంపుగా చేరి ఒక వ్యక్తిని చంపడం అక్కడ సర్వసాధారణంగా మారుతోంది. 
 
మరీ ముఖ్యంగా హిందూ సమాజానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ఆరోపణలు చేయడం వెనుక లోతైన కుట్రలు ఉండవచ్చని మానవ హక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయి. బాధితుడి కుటుంబ సభ్యులు ఈ దాడిని పథకం ప్రకారం జరిగిన హత్యగా పేర్కొంటున్నారు. బంగ్లాదేశ్‌లో ఇటువంటి దాడులు వరుసగా జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
 
గడిచిన ఐదు రోజుల్లో మొత్తం 7 హిందూ కుటుంబాలపై నిరసనకారులు దాడి చేశారు. ఈ ఘటనలలో కొన్ని ప్రత్యేకంగా దారుణమైనవి. ముఖ్యంగా, రెండు ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టడంతో ఆ కుటుంబంలోని 8 మంది చాలాకష్టంతో తప్పించుకున్నారు. ఈ దాడులు స్థానికులకే కాకుండా, సమీప ప్రాంతాల్లో పెద్ద భయాన్ని కలిగించాయి.
 
గతంలోనే దీపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిని కొందరు దుండగులు అతి కిరాతకంగా చంపి, మృతదేహాన్ని తగలబెట్టిన ఘటన మరువక ముందే అమృత్ మండల్ హత్య జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాలనలో మైనారిటీలకు రక్షణ కరువైందని, మతపరమైన వివక్షతో దాడులు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.