ఇటీవల శ్రీశైలం ఆలయ పరిధిలో ఓ యువతి రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పదంగా మారడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. క్షేత్ర పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా ఆలయ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, భక్తుల ప్రశాంతతే తమ ప్రధాన లక్ష్యమని ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఆలయ సంప్రదాయాలు, నియమాలను గౌరవిస్తూ భక్తులు తమ భక్తిని వ్యక్తపరచాలని సూచించారు. శ్రీశైలం లాంటి పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆలయ పరిధిలో అనుమతి లేకుండా రీల్స్ తయారు చేయడం, వీడియోలు చిత్రీకరించడం, డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా నిషేధమని ఆలయ ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల భక్తిభావాలకు, ఆలయ ఆచారాలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ నియమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో అన్యమత ప్రచారాలు, అసభ్య ప్రవర్తన, మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ధూమపానం, మద్యపానం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆలయ పరిధిలో అసలు చోటు లేదని తేల్చిచెప్పారు. ఈ తరహా చర్యలు ఆలయ ప్రశాంతతను భంగం చేయడమే కాకుండా, భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అందువల్ల ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ నియమాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.

More Stories
శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం
శ్రీశైలంలో పెరిగిన స్పర్శ దర్శనం వేళలు
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికే