అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించారు. అయితే ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరగడంతో ఏ పదవీ లేని మంత్రిగా కేబినెట్లో ఆయన కొనసాగుతున్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) క్రీడా మంత్రి మాణిక్రావు కోకాటే పట్టుబడ్డారు.
ఆయనపై చర్యలు తీసుకుంటామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాడు హెచ్చరించారు. అయితే మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఒత్తిడి వల్ల మిన్నకుండిపోయారు. కాగా, 1995 గృహనిర్మాణ కుంభకోణం కేసులో మంత్రి మాణిక్రావు కోకాటే, ఆయన సోదరుడ్ని ముంబై కోర్టు దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పును బాంబే హైకోర్టులో ఆయన సవాల్ చేశారు. అయితే శుక్రవారం విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముంబై ఆసుపత్రిలో చేరారు. మరోవైపు మాణిక్రావు కోకాటే కోర్టు వ్యవహారంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కూటమి ప్రభుత్వంలో భాగమైన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో చర్చించారు. గతంలో షిండే వర్గం మంత్రులపై ఆరోపణలు, కోర్టు కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాణిక్రావు కోకాటేను క్రీడా మంత్రిత్వ బాధ్యతల నుంచి గురువారం తొలగించారు. ఎమ్మెల్యే అనర్హత అంశం ఇంకా తేలకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో ఏ పదవి లేని మంత్రిగా కేబినెట్లో ఆయన ఉన్నారు.

More Stories
బలూచిలో కాల్పులు.. పాక్ ఆరోపణలు ఖండించిన భారత్
ఎన్సీపీ ఎన్డీయేలో భాగస్వామిగానే కొనసాగుతుంది
సాగుకు ‘ఏఐ’ సాయం- రైతుల కోసం ‘భారత్ విస్తార్’