పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్/కంపెనీ స్థాయి కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా/ప్లాటూన్ కమిటీ సభ్యులు, 23 మంది సాధారణ పార్టీ సభ్యులు ఉన్నారు. ఇన్సాస్ ఎల్ఎంజీ, ఏకే–47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, .303 రైఫిళ్లు తదితర ఆయుధాలు లొంగుబాటులో భాగంగా అప్పగించారు.లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు, మిగతా వాళ్లు ఛత్తీస్గఢ్ వాసులని తెలిపారు.
అలాగే 11 మంది గెరిల్లా ఆర్మీ బెటాలియన్ చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. 24 ఏళ్లుగా అండర్ గ్రౌండ్లో ఉన్న తెలంగాణకు చెందిన ఎర్రోల్ల రవి అలియాస్ సంతోష్, ప్రవీణ్ లొంగిపోయారని అన్నారు. అలాగే కనికారుపు ప్రభంజన్ పార్టీ సభ్యుడు, పీడీఎస్ సభ్యుడు, రెండో రీజినల్ కమాండ్ ఆఫ్ తెలంగాణకు చెందిన 5 మంది, కొత్తగూడెం, అల్లూరు సీతరామరాజు డీవీసీ స్టేట్ కమిటీ క్యాడర్కు చెందిన నలుగురు సరెండర్ అయినట్లు చెప్పారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 509మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత బలహీనత, నాయకత్వంపై నమ్మకం తగ్గడం, అడవుల్లో తీవ్ర జీవన కష్టాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగానే తాము ప్రధాన జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. ప్రాణాలు కాపాడుకోడానికి తెలియని ప్రదేశాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ ఒత్తిడి చేసిందని.. ఇలాంటి పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా భావించి మావోలంతా లొంగిపోయినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.లొంగిపోయిన వారికి రాష్ట్ర పునరావాస విధానం ప్రకారం డివిజనల్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. ఆయుధాలపై అదనపు రివార్డు కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు మరింత బలహీనపడతాయని, మిగిలిన అజ్ఞాత కేడర్లు కూడా హింసను వీడి జనజీవనంలోకి రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

More Stories
ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల నిజాయతీకి ప్రాధాన్యత ఇవ్వాలి
ఫోన్ ట్యాపింగ్ పై సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్
ఆర్థికంగా సంక్షోభంలో తెలంగాణ విద్యుత్ రంగం