ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. గోలపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అటవీ కొండపై గురువారం ఉదయం జిల్లా రిజర్వ్‌ గార్డు బృందానికి మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందించింది.  ఈ సమాచారం ఆధారంగా రిజర్వ్‌గార్డు మావోయిస్టులు ఉన్న ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పడు కాల్పులు జరిగాయి. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌ కొనసాగుతుంది.   నేడు ఉదయం నుంచే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడూ కాల్పులు శబ్దాలు వినిపించాయి. దీంతో, అధికారులు హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇక తాజా ఎన్‌కౌంటర్‌ తరువాత పోలీసులు ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
 
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని సుక్మా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ గురువారం మీడియాకు వెల్లడించారు.  ఈ ఘటనలో కొందరు మావోయిస్టులు మరణించినా గాయపడ్డ వారు అడవిలోకి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, అదనపు భద్రతా దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
 
తాజా మృతులతో ఈ ఏడాదిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 284 మంది మావోయిస్టులు చనిపోయారు. బస్తర్‌ డివిజన్‌, బీజాపూర్‌, దంతేవాడ సహా ఏడు జిల్లాల్లో 255 మంది మృతి చెందారు. మరో 27 మంది రారుపూర్‌ డివిజన్‌లోని గరియాబంద్‌ జిల్లాలో, దుర్గ్‌ డివిజన్‌లోని మోహ్లా – మన్‌పూర్‌- అంబాఘర్‌ చౌకి జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.