పొరుగుదేశమైన బంగ్లాదేశ్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత విదేశాంక శాఖ (ఎంఈఏ) బంగ్లాలో తీవ్రమవుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢాకాలోని వీసా కేంద్రాన్ని బుధవారం మూసివేసింది. బంగ్లాదేశ్ నాయకులు, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపుల నేపథ్యం అక్కడి వీసా అప్లికేషన్ సెంటర్ లో సేవలకు మంగళం పాడింది భారత్.
ఢాకాలోని జమున ఫ్యూచర్ పార్క్లో భారత వీసా అప్లికేషన్ సెంటర్ ఉంది. మనదేశం రావాలనుకునే బంగ్లాదేశీయులకు ఈ కేంద్రం నుంచే వీసాలు మంజూరు చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు కొరవడ్డాయి. ఆ దేశంలో రోజురోజుకు సురక్షిత వాతావరణం తగ్గిపోతుండడాన్ని సీరియస్గా తీసుకున్న విదేశీ మంత్రిత్వ శాఖ భారత్లోని బంగ్లా దౌత్యాధికారికి బుధవారం ఉదయం సమన్లు జారీ చేసింది.
బుధవారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఈ కేంద్రాన్ని మూసేస్తున్నట్టు, పరిశీలనలో ఉన్న దరఖాస్తుల తేదీలను మార్చినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై ర్యాడికల్ గ్రూప్ దాడికి యత్నించడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత వ్యతిరేక ర్యాలీ చేపట్టిన ర్యాడికల్ గ్రూప్ ఢాకాలోని ఎంబసీని టార్గెట్ చేసింది.
లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను బంగ్లా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఢాకాలోని ఎంబసీకి బెదిరింపులు, బంగ్లా రాజకీయ నాయకుల విద్వేషపూరిత ప్రకటనలపై భారత్ ఇప్పటికే స్పందించి, న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారికి సమన్లు జారీచేసి, భారత్ నిరసన తెలియజేసిన కొద్ది గంటల్లోనే ఢాకాలోని ఎంబసీపై దాడికి యత్నించడం గమనార్హం.
గత ఏడాది జులై- ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి చివరకు ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్కు పారిపోయివచ్చారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇది భారత్- బంగ్లా మధ్య ఉద్రిక్తలకు దారితీసి, వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
భారత కేబుల్ టీవీ పరికరాలకు బంగ్లాదేశ్ కీలకమైన మార్కెట్. అయితే, వీసా పరిమితుల కారణంగా 26వ కేబుల్ టీవీ షోకు ఆ దేశం నుంచి హాజరయ్యే ప్రతినిధుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘‘సాధారణంగా ఈ ప్రదర్శనకు బంగ్లాదేశ్ నుంచి సుమారు 400 ప్రతినిధులు వస్తుంటారు. కానీ ఈసారి వివిధ కారణాల వల్ల వీసాలు దొరకడం పెద్ద సమస్యగా మారింది’” అని కేబుల్ టీవీ ఎక్విప్మెంట్ ట్రేడర్స్ అండ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సిటిఎంఏ) ఎగ్జిబిషన్ చైర్మన్ పవన్ జజోడియా తెలిపారు.
భారత హైకమిషన్ను పదేపదే కోరినప్పటికీ, కేవలం 60 మంది ప్రతినిధులకు మాత్రమే వీసాలు లభించాయని ఆయన చెప్పారు. ఈ పరిమిత భాగస్వామ్యం సరిహద్దు వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు, భారత్కు చెందిన మత్స్యకారుల పడవ ఎఫ్బీ పరామిత-2 బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల సరిహద్దుల సమీపంలో బంగ్లా పెట్రోలింగ్ నౌక ఢీకొట్టడంతో మునిగిపోయింది.
ఈ ఘటనలో రాజ్దుల్ అలీ షేక్ అనే మత్స్యకారుడ్ని ఈటెలాంటి పదునైన ఆయుధంతో పొడిచి చంపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన 11 మంది మత్స్యకారులు ఈ దాడి గురించి వివరిస్తూ ఓడలో ఉన్న వారందరూ దాదాపు చనిపోయారని వివరించారు. వారు మంగళవారం నామ్ఖానాకు చేరుకోగా ఐదుగురు ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

More Stories
ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం
నెహ్రూ ప్రైవేటు లేఖలు తప్పి పోలేదు… సోనియా దగ్గరున్నాయ్
విఫల ప్రయోగంగా నిరూపితమైన సిపిఐ (మావోయిస్టు)