గత 30 ఏళ్లకుపైగా అమెరికాలో నివసిస్తున్న 60 ఏళ్ల భారతీయ మహిళను గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ చివరి రౌండ్ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. పంజాబ్కు చెందిన బబ్లెజిత్ ‘బబ్లీ’ కౌర్ 1994 నుంచి అమెరికాలో ఉంటున్నారు. పెండింగ్లో ఉన్న గ్రీన్ కార్డు అప్లికేషన్ బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్ కోసం వెళ్లిన సమయంలో ఫెడరల్ ఏజెంట్లు తన తల్లిని అదుపులోకి తీసుకున్నట్టు ఆమె కుమార్తె జోటి తెలిపారు.
లాంగ్ బీచ్ వాచ్డాగ్ నివేదిక ప్రకారం కౌర్కు అమెరికా పౌరులైన మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త గ్రీన్ కార్డ్ పిటిషన్ ఉంది. జోటి మాట్లాడుతూ తన తల్లి డిసెంబరు 1న అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసు ఫ్రంట్ డస్క్లో ఉండగా పలువురు ఫెడరల్ ఏజెంట్లు అక్కడకు వచ్చారని తెలిపారు. వారు ఓ గదిలోకి వెళ్లిన తర్వాత ఆమెను అందులోకి పిలిపించి అరెస్ట్ చేశారని చెప్పారు.
తన లాయర్తో ఫోన్లో మాట్లాడటానికి అనుమతించారు కానీ ఇంకా తన తల్లి ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులోనే ఉన్నారని పేర్కొన్నారు. ఆమెను ఎక్కడకు తీసుకెళ్లారనేది కొద్ది గంటల పాటు కౌర్ కుటుంబానికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, ఆమెను రాత్రికి రాత్రే ప్రస్తుతం ఐసీఈ డిటెన్షన్ సెంటర్గా ఉపయోగిస్తోన్న అడెలాంటో పాత జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమెను అక్కడే ఉంచారు.
పంజాబ్కు చెందిన కౌర్ కుటుంబం 90 వ దశకంలో అమెరికాకు వలస వెళ్లి తొలుత లాంగునా బీచ్లో స్థిరపడింది. అక్కడ నుంచి బెల్మాంట్ షోర్లోని లాంగ్ బీచ్కు వెళ్లింది. కౌర్ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా ఇండియాలో ఉన్నప్పుడు పుట్టిన పెద్ద కుమార్తె జోటి (34) డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్) కార్యక్రమం కింద అమెరికాలో చట్టబద్ధమైన హోదా పొందింది.
మిగతా ఇద్దరు అమెరికాలోనే జన్మించడంతో వారికి ఆ దేశ పౌరసత్వం లభించింది. కౌర్, ఆమె భర్త గత 20 ఏళ్లుగా బెల్మాంట్ షోర్ సెకెండ్ స్ట్రీట్లో నటరాజ్ క్యుజిన్ పేరుతో భారతీయ ఈటరీ నిర్వహిస్తున్నారు. ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్లో కూడా సుమారు 25 ఏళ్లు పనిచేసింది. అయితే ఈ ఏఢాది ఆరంభంలో ఆ ఫార్మసీ తన శాఖలను మూసివేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్ రెస్టారెంట్లో తిరిగి చేరడానికి సిద్ధమవుతున్నారు.
కౌర్ను విడుదల చేయాలని లాంగ్ బీచ్ ప్రతినిధి, డెమొక్రాటిక్ క్రాంగెస్మెన్ రాబర్ట్ గార్సియా డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాము ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన కార్యాలయం తెలిపింది.

More Stories
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
బీబీసీపై ట్రంప్10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా
హైదరాబాద్ నుండే ఆస్ట్రేలియా వెళ్లిన ఉగ్రవాది సాజిద్!