నోబెల్‌ గ్రహీత నర్గెస్‌ మొహమ్మది అరెస్ట్‌

నోబెల్‌ గ్రహీత నర్గెస్‌ మొహమ్మది అరెస్ట్‌

నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత, ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గెస్‌ మొహమ్మదిని స్థానిక పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇటీవల మరణించిన ఓ మానవ హక్కుల న్యాయవాది స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె మద్దతుదారులు, సంబంధిత స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. అయితే, ఆమె అరెస్టుపై ఇరాన్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్‌ పోలీసులు అరెస్టు చేయడంపై నార్వే నోబెల్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనిని క్రూరమైన అరెస్ట్​గా పేర్కొంది. మొహమ్మదిని ఎక్కడో ఉందో స్పష్టం చేయాలని, అలాగే భద్రతను కూడా నిర్ధారించాలని తెలిపింది. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఆమెను విడుదల చేయాలని నోబెల్ కమిటీ డిమాండ్ చేసింది. నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్గన్‌ వాట్నే ఫ్రైడ్నేస్‌ ఈ మేరకు ప్రకటనను విడుదుల చేశారు.

“నర్గెస్‌ మొహమ్మదిని, ఇతర కార్యకర్తలతో పాటు అరెస్ట్ చేయడం పట్ల నార్వే నోబలె కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్‌లో మానవ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య భాగస్వామ్యం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి. ఇరాన్ అధికారులు ఆమె ఉన్నచోటును వెంటనే వెల్లడించి” అని డిమాండ్ చేసింది. 

ఆమె భద్రతను, గౌరవాన్ని కాపాడాలని, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. ఇరాన్‌లో న్యాయపాలన, భావప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం శాంతియుతంగా పనిచేస్తున్న వారందరితో పాటు నర్గెస్‌ మొహమ్మదినికి కమిటీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఫ్రైడ్నేస్ పేర్కొన్నారు. 

వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించిన సమయంలోనే నర్గెస్‌ మొహమ్మదినికి అరెస్ట్ చేయడం గమనార్హమని తెలిపారు. మహిళా హక్కుల కోసం ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గెస్‌ మొహమ్మది ఇప్పటికే అనేక సార్లు జైలుకు వెళ్లారు.  పలుమార్లు శిక్షను కూడా అనుభవించారు. ఎన్నో కొరడా దెబ్బలను సైతం ఓర్చుకున్నారు. 

మూడు దశాబ్దాలకు పైగా ఆమె చేస్తోన్న ఈ పోరాటానికి గుర్తింపుగా 2023లో నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. జైల్లో ఉండగానే ఆమె నోబెల్‌కు ఎంపికయ్యారు. వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు, అనారోగ్య కారణాలతో డిసెంబర్‌ 2024లో కొన్ని వారాలపాటు పెరోల్‌ లభించింది.  అనంతరం అంతర్జాతీయ హక్కుల నేతలు, పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై ఒత్తిడి దృష్ట్యా ఆమెకు లభించిన ఉపశమనం కొనసాగుతోంది. ఇటీవల 12 రోజుల పాటు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కొనసాగిన వేళ ఆమె బయటే ఉన్నారు. ఈ సమయంలో నిరసన కార్యక్రమాలు, అంతర్జాతీయ మీడియాలోనూ చురుకుగా వ్యవహరిస్తున్నారు.