హిందూవులకు అనుకూలంగా తీర్పు ఇస్తే రాజకీయ బెదిరింపా!

హిందూవులకు అనుకూలంగా తీర్పు ఇస్తే రాజకీయ బెదిరింపా!

* హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్‌ స్వామినాథన్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 120 మంది ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం లోక్‌సభ స్పీకర్‌కు నోటీస్‌ సమర్పించడం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి, పార్టీ లోక్‌సభ నాయకుడు టీఆర్‌ బాలు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అభిశంసన నోటీసును అందజేశారు. ఇది న్యాయవ్యవస్థను రాజకీయంగా బెదిరించడమే అని స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థను భయపెట్టేలా, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని  పవన్ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పిటిషన్‌కు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినపుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువడ్డాయని పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేశారు. ఆ తీర్పు వల్ల సామాజిక అశాంతి చెలరేగినా, అప్పట్లో ఏ న్యాయమూర్తిపైనా అభిశంసన ప్రతిపాదన తీసుకురాలేదని తెలిపారు. కేవలం తీర్పుపై న్యాయపరమైన పునఃపరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. 

అలాగే ఓ మాజీ సీజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అదే ఆ మాజీ సీజేఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకొని రాజకీయ పార్టీలు ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.

ఆ తీర్పునకు ప్రతిగా డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు 120 మందికిపైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే ‘సాక్ష్యాలతో నిర్ధారిత దుర్వినియోగం లేదా అశక్తత’ అవసరమని పవన్ కల్యాణ్‌ తెలిపారు. 

కేవలం ఒక తీర్పు నచ్చలేదన్న కారణంతో ఇంపీచ్‌మెంట్‌ నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలపై కేసుల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పంపే ప్రయత్నమే ఇదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పుగా మారుతున్నాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. 

రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ వ్యవహారాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని ఉప ముఖ్యమంత్రి మరో సారి స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా, మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని ఆయన తెలిపారు.