వలసలపై ఆంక్షలతో నష్టపోయేది ఆ దేశాలే

వలసలపై ఆంక్షలతో నష్టపోయేది ఆ దేశాలే

అమెరికా, ఐరోపా దేశాల్లో వలసలపై ఆంక్షలతో ఆ దేశాలే నష్టపోతున్నాయని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పష్టంచేశారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే ఆ ఆంక్షలు విధించిన దేశాల సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. చివరకు ఆ దేశాలే నష్టపోతాయని హెచ్చరించారు.ఢిల్ల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలోపాల్గొంటూ చాలా సందర్భాల్లో అమెరికా, ఐరోపా దేశాల వాళ్లే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

వలసలకు సంబంధించి అమెరికా, ఐరోపా దేశాల్లో ఏమైనా ఆందోళనలు ఉంటే అవి ఆ దేశాలు అమలు చేసిన దీర్ఘకాలిక విధానాల ఫలితమేనని స్పష్టం చేశారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఉద్దేశపూర్వకంగా అన్నీ తెలిసే తమ వ్యాపారాలను విదేశాలకు విస్తరించారని, ఇది వారి వ్యూహమని, కాబట్టి ఈ సమస్యలకు స్వయంగా పరిష్కార మార్గాలను వారే కనుగొనాలని వ్యాఖ్యానించారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలనేవి ఇరుపక్షాలకు ప్రయోజనమని పాశ్చాత్య దేశాలు గుర్తించాలని సూచించా రు. 

ఒకవేళ పెద్దఎత్తున ఆంక్షలు విధిస్తే ఆ దేశాలే నష్టపోతాయని, ప్రపంచం అధునాతన తయారీ రంగంవైపు మళ్లుతున్న కొద్దీ నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరం పెరుగుతుందని చెప్పారు. ఏ దేశం కూడా స్వయంగా సరిపడా సంఖ్యలో నిపుణులను వేగంగా తయారు చేయలేదని జయశంకర్ పేర్కొన్నారు. ఒత్తిళ్లను సమతుల్యం చేసుకునేందుకు పాశ్చాత్య దేశాలు చివరకు ఓ మార్గాన్ని కనుగొంటాయని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.