మరో కేసులో దోషిగా షేక్‌ హసీనా, మేనకోడలు

మరో కేసులో దోషిగా షేక్‌ హసీనా, మేనకోడలు

ప్రభుత్వ భూమి ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన కేసులో బహిష్కృత ప్రధాని షేకహేసీనా, ఆమె మేనకోడలు, బ్రిటీష్‌ లేబర్‌ పార్టీ సభ్యురాలు తులీప్‌ సిద్ధిక్‌‌లను ఢాకా కోర్టు దోషులుగా తేల్చింది. హసీనాకు  ఐదేళ్లు, ఆమె మేనకోడలికి  రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు  ఢాకా కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్‌ ప్రధానిగా హసీనా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఢాకా స్పెషల్‌ జడ్జెస్‌ కోర్ట్‌ జడ్జి రబియుల్‌ ఆలం వ్యాఖ్యానించారు. 

తన తల్లి, ఇద్దరు సోదరీమణులకు ప్రభుత్వ ప్రాజెక్టులో భూమిని ఇచ్చేందుకు తన అత్త హసీనాను అవినీతికి పాల్పడేలా ప్రభావితం చేసినందుకు సిద్ధిక్‌ని దోషిగా నిర్థారిస్తున్నట్లు తీర్పునిచ్చారు.  బ్రిటన్‌ పార్లమెంటులో లండన్‌లోని హాంప్‌స్టెడ్‌, హైగేట్‌ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తులిప్‌ సిద్ధిఖ్‌ గతంలో ఈ ఆరోపణలను ఖండించారు. ఈ విచారణ కల్పిత ఆరోపణలపై, రాజకీయ ప్రతీకారంతో నడపబడుతున్న ఒక ప్రహసనమని పేర్కొన్నారు. 

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పరిగణిస్తున్న సిద్ధిక్‌ తల్లి షేక్‌ రెహానాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది. విచారణ సందర్భంగా నిందితులు ముగ్గురూ కోర్టుకు హాజరుకాలేదు. కేసులో మరో 14 మంది నిందితులకు కూడా తలా ఐదేళ్ల జైలు శిక్షపడింది. దోషులైన 17 మందికి లక్ష బంగ్లాదేశ్ టాకాల చొప్పున జరిమానా విధించారు.  జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు.

బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ ఈ భూ కేటాయింపుల వ్యవహారంపై మొత్తం ఆరు కేసులు దాఖలు చేసింది.  కాగా, ఇదే తరహా అవినీతి ఆరోపణలపై గత నవంబర్ 27న కూడా మరో కోర్టు హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  అదేవిధంగా అల్లర్ల సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చి వందలాది మరణాలకు కారణమయ్యారన్న కేసులో ఆమెకు మరణశిక్ష కూడా విధించారు. 

తాజా తీర్పుపై షేక్ హసీనా కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. తమపై మోపిన అవినీతి ఆరోపణలన్నీ నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ఓ ప్రకటనలో ఖండించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏసీసీని నియంత్రిస్తోందని ఆరోపించారు. పక్షపాత సాక్ష్యాలతో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారని వారు విమర్శించారు. కనీసం మా వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కూడా ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించింది.