గత ఏడాది జూన్ లో పాశమైలారం సిగాచీ పరిశ్రమలో 54 మంది మృతి చెందిన పేలుడు ప్రమాదంలో ఇప్పటికీ బాధ్యులను గుర్తించని పొలిసు దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం సాధారణ ఘటన కాదని.. , 54 మంది కార్మికులు చనిపోయారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ గుర్తు చేశారు. ఈ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటి? అని ప్రశ్నించారు.
దర్యాప్తుపై ఏఏజీ నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనపై దర్యాప్తు నత్తనడకన నడుస్తోందని చెబుతూ ఇలా ఎందుకు అవుతోందని సీజే ప్రశ్నించారు.
“సిగాచీ పేలుడు ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏమిటి? ఈ ప్రమాదంపై 237 మంది సాక్షులను విచారించినా దర్యాప్తులో పురోగతి లేదా? ఈ దుర్ఘటనకు కారణమైన వారిని ఇప్పటివరకు మీరు గుర్తించలేదా? ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా ఒక డీఎస్పీని నియమిస్తారా?” అంటూ ప్రశ్నలు సంధించారు.
సిగాచీ పేలుడుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సిగాచీ పేలుడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఐఆర్- ఐఐసీటీ, నాగ్పుర్ ఫోరెన్సిక్ ఫైర్ సైబర్ ఇన్వెస్టిగేటర్స్ సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది.
ఇటీవల ఈ కమిటీ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. అందులో, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల భద్రతను గాలికి వదిలేయడంతోనే భారీ ప్రాణనష్టం జరిగిందని చెప్పింది. ప్రమాదం జరిగిన ప్యాకేజింగ్ ప్రాంతంల మండే స్వభావమున్న 17 టన్నుల మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ ఉందని తెలిపింది.
దాని కారణంగా 900- 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడిందని చెప్పింది. సీలింగ్ మిషన్ పక్కనే 750 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే 26 మృతదేహాలు పడి ఉన్నాయని తెలిపింది. నిర్వహణను సిగాచీ పరిశ్రమ సరిగా పట్టించుకోలేదని పేర్కొంది. పరిశ్రమలో అగ్నిప్రమాద వ్యవస్థను కూడా సరిగా ఏర్పాటు చేయలేదని తెలిపింది.

More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఓఎస్డీని విచారించిన సిట్
గిరిజన సంస్థ పెట్రోల్ బ్యాంకుల్లో అవినీతిపై దర్యాప్తు జరపాలి
ప్రపంచంలోనే తొలి యాంటీ-డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్ రేంర్’