నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపానుకు “దిత్వాహ్”గా యెమన్ దేశం నామకరణం చేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో తుపాను కదులుతోందని పేర్కొన్నారు.
‘దిత్వాహ్’ తుపాను ట్రింకోమలీ (శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 24 గంటల్లో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఆయా జిల్లాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దీని ప్రభావంతో శనివారం నుంచి సోమవారం వరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.

More Stories
రాజధానిని గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
తిరుపతిలో 600 ఎకరాలలో ధార్మిక టౌన్ షిప్
వేంకటేశ్వరస్వామికి అపవిత్రత ఎవ్వరినీ చేయనీయను