తెలంగాణాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

తెలంగాణాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని మంగళవారం ప్రకటించారు. డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ మంగళవారం నుంచే అమలులోకి వస్తుందని తెలిపారు. 
 
ఒక దశకు మరొక దశకు మధ్య రెండు, మూడు రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు. 12,728 సర్పంచ్‌ స్థానాలు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.  తొలి దశలో 4200 సర్పంచ్‌ స్థానాలు, 37,440 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. తొలి దశ ఎన్నికల నామినేషన్లకు గురువారం నుంచే అవకాశం ఉంటుందని, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. 
 
పోలింగ్‌ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. సెప్టెంబర్‌ 29న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌ 9న షెడ్యూల్‌పై స్టే విధించారని ఎస్‌ఈసీ కుముదిని పేర్కొన్నారు. ఈ నెల 27నుంచి తొలి దశల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. 
 
నవంబర్‌ 30 నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు మొదలుకానుండగా, మూడో దశ నామినేషన్ల ప్రక్రియ డిసెంబర్‌ 3వ తేదీన ప్రారంభమవుతుందని రాణి కుముదిని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలకు మరియు 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని ఆమె ప్రకటించారు.