ఛత్తీస్‌గఢ్‌లో 41 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో  41 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది మావోయిస్టులు బీజాపూర్‌ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 32 మంది నక్సల్స్‌పై కోటి 19లక్షల రూపాయల రివార్డు ఉంది. వీరిలో కొందరికి ఇటీవల మరణించిన మోస్ట్ వాటెండ్​ మావోయిస్టు మాద్వి హిడ్మాతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వం అందిస్తున్న పునరావాస విధానం నచ్చటం వల్లే లొంగిపోయినట్లు మావోయిస్టులు చెప్పారని బీజాపూర్ జిల్లా ఎస్పీ  జితేంద్ర కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

లొంగిపోయిన 41 మంది మావోయిస్టుల్లో 39 మంది దండకారణ్య స్పెషల్ జోనల్‌ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, ధంతారీ-గరియాబంద్-నౌపాడ డివిజన్లకు చెందినవారు అని ఎస్పీ వివరించారు.  లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయంగా 50 వేల రూపాయల చొప్పున అందించినట్లు చెప్పిన ఎస్పీ మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

“మావోయిస్టులు తమ హింసాత్మక సిద్ధాంతాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పుణ మార్గెమ్​ విధానం వల్ల భద్రతో పాటు గౌరవం పెరుగుతుంది” అని ఎస్పీ చెప్పారు. 

“డీఆర్​జీ, నక్సల్ సెల్​, ఎస్​టీఎఫ్​ సహా పలు కోబ్రా, సీఆర్​పీఎఫ్​ బెటాలియన్లు మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించాయి. లొంగిపోయిన 41 మంది మావోయిస్టుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్‌ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, ధంతారీ-గరియాబంద్-నౌపాడ డివిజన్లకు చెందిన వారు ఉన్నారు” అని ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ చెప్పారు. 

వారిలో, ఐదుగురు పీఎల్​జీఏ మొదటి బెటాలియన్ కమిటి సభ్యులు, ముగ్గురు ఏరియా కమిటీ సభ్యులు, నలుగురు మిలిటరీ ప్లాటూన్​ కమాండర్లు, ఒకరు డిప్యూటీ కమాండర్, ​ఆరుగురు మిలిటరీ ప్లాటూన్ సభ్యులు, జనతా సర్కార్​ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు ఉన్నారని వివరించారు.