తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్

తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్
ఈ మధ్యకాలంలో సైబర్​ నేరగాళ్లు సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అందరి ఫోన్లనూ హ్యాక్ చేస్తున్నారు. ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగి, ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్త పడుతుండటంతో ఇప్పుడు డైరెక్టుగా మొబైల్​ ఫోన్లనే హ్యాక్​ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఏపీకే ఫైల్స్​ పేరుతో సైబర్​ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు.

‘ఆధార్​తో పాటు ఇతర నో యువర్​ కస్టమర్​ (కేవైసీ) వివరాలు అప్​డేట్​ చేసుకోని కారణంగా ఈ రోజు రాత్రి నుంచి మీ బ్యాంకు ఖాతా బ్లాక్​ చేస్తున్నాం. వెంటనే ఈ కింద ఉన్న లింకును క్లిక్​ చేసి వివరాలు అప్​లోడ్​ చేయండి’ అని టీం ఎస్బీఐ పేరుతో ఆదివారం అనేక వాట్సాప్​ గ్రూపుల్లో సందేశాలు వచ్చాయి.  ఎస్బీఐ అకౌంట్స్​ ఉన్న చాలా మంది బ్లాక్​ అవుతుందన్న భయంతో లింకుపై క్లిక్ చేశారు. అప్పటి నుంచే వారి మొబైల్స్​ సైబర్​ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లాయి.

ఆ తర్వాత సదరు ఫోన్​లో ఉన్న ఇతర వాట్సాప్​ గ్రూపుల్లోకి ఈ సందేశాన్ని పంపారు. ఇలా గొలుసుకట్టుగా వేలాది ఫోన్లకు వెళ్లాయి.  ఇందులో రాష్ట్ర మంత్రిత్వ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసుకున్న గ్రూపులతో పాటు స్నేహితులు, విద్యార్థుల గ్రూపులు కూడా ఉన్నాయి. ఫోన్లలోని సమాచారం సైబర్​ నేరగాళ్లకు చేరడంతో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. పలువురు స్థానిక పోలీసులతో పాటు 1930కి కూడా ఫిర్యాదు చేస్తున్నారు.

రాష్ట్రంలోని మంత్రులకు సంబంధించిన మీడియా వ్యవహారాల వాట్సాప్​ గ్రూప్​ హ్యాక్​ అయినట్టు తెలుస్తోంది. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్​ను సైబర్​ నేరగాళ్లు షేర్​ చేస్తున్నారు. ఆధార్​ అప్​డేట్​ చేసుకోవాలని సూచిస్తూ మంత్రుల శాఖలు పర్యవేక్షించే అధికారులు, జర్నలిస్టులకు ఎస్బీఐ పేరుతో మెసేజ్​లు పంపినట్టు సమాచారం. ఈ ఏపీకే ఫైల్స్​ను ఓపెన్​ చేయొద్దని సైబర్​ క్రైమ్​ పోలీసులు సూచిస్తున్నారు.