బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర (89)  సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. ధర్మేంద్ర మృతి పట్లు ప్రముఖ నటులు, సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు.

బాలీవుడ్ హీమ్యాన్‌గా ధర్మేంద్రకు గుర్తింపు పొందారు.హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా పేరు పొందిన ధర్మేంద్ర  మరణవార్త విన్న బాలీవుడ్‌ దు:ఖసాగరంలో మునిగిపోయింది.  బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ధర్మేంద్ర జీ మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు.

ఇటీవల ఆనారోగ్యం కారణంగా ధర్మేంద్రను కుటుంబ సభ్యులు పలుమార్లు ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఈ నెల 10న మరోసారి హాస్పిటల్​లో చేరడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించిందని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయనకు ఇంటి నుంచే చికిత్స అందించారు. ఈ క్రమంలో మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం కన్నుమూశారు.

ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాష్ కౌర్, రెండవ భార్య హేమ మాలినిలతో పాటు కుమారులు సన్నీ, బాబీ, కుమార్తెలు అజీత, విజయత, ఈషా, అహానా ఉన్నారు. 1935లో పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో ‘ దిల్ భీ తేరా హమ్ భీ తేరే’తో నటుడిగా అరంగేట్రం చేశారు.  అలా దాదాపు 60ఏళ్లకు పైగా భారతీయ సినిమాలో ధర్మేంద్ర ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన కెరీర్​లో 300+ సినిమాల్లో నటించి లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందారు. 

సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఆయనను పద్మభూషణ్​ అవార్డుతో సత్కరించింది.  ధర్మేంద్ర చివరిసారిగా ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’లో షాహిద్ కపుర్​, కృతి సనన్‌లతో కనిపించారు. అందులో షాహిద్ తాతగా నటించారు. అంతేకాకుండా రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన బ్లాక్ బస్టర్ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో కూడా ఆయన నటించారు.

ఈ నటుడు తదుపరి శ్రీరామ్ రాఘవన్ ‘ఇక్కీస్‌’లో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్​ 25న విడుదల కానుంది. చిన్నవయసులోనే పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్న సెకండ్​ లెఫ్టినెంట్​ అరుణ్​ ఖేతర్​పాల్​ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ధర్మేంద్ర అరుణ్​ తండ్రిగా కనపడనున్నారు.