జి20 సదస్సుకు అమెరికా, రష్యా, చైనా అధినేతలు దూరం!

జి20 సదస్సుకు అమెరికా, రష్యా, చైనా అధినేతలు దూరం!
* ప్రమాదంలో జీ-20 కూటమి ఉనికి ..  మేక్రాన్‌ హెచ్చరిక 
20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జి20 శిఖరాగ్ర సమావేశంకు మొదటిసారిగా మూడు కీలక దేశాల అధినేతలు గైరాజరు కావడం విస్మయం కలిగిస్తున్నది. ఇప్పటికే  జోహన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులోని మూడు స్టేషన్లలో ఆయన పాల్గొంటారు.  సమ్మిళిత అభివృద్ధి వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. 
అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్రనాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు.  అమెరికా జి20 వ్యవస్థాపక సభ్యదేశం. తదుపరి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. అలాంటి సమయంలో ఈ సమా దేశంలో అగ్రరాజ్యం పాల్గొనకపోవడం అనేది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే ఈ సదస్సుకు హాజరు  కాబోనని స్పష్టంగా ప్రకటించారు. 

దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త భూ సంస్కరణల చట్టం తర్వాత దక్షిణాఫ్రికా లో శ్వేతజాతి రైతులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే చివరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి అమెరికా తన తాత్కాలిక రాయబారి మార్క్ డి. డిల్లార్డ్ను పంపింది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, ఆయన బదులుగా చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ను తన ప్రతినిధిగా పంపినట్లు సమాచారం. ఇక పుతిన్ పై అరెస్టు వారెంట్ కారణంగా ఆయన విదేశీ పర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీ-20 సదస్సుకు దూరంగా ఉండటాన్ని మేక్రాన్‌ ప్రస్తావిస్తూ జీ-20 కూటమి ఉనికి ప్రమాదంలో ఉందని, ప్రధానమైన అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో జీ-20 ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మేక్రాన్‌ దక్షిణాఫ్రికా జోహనస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న జీ-20 సదస్సులో  హెచ్చరించారు.

ఉక్రెయిన్‌ ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా అక్కడ శాంతి సాధ్యం కాదని మేక్రాన్‌ అభిప్రాయపడ్డారు. మానవతా చట్టాలు, ప్రాదేశిక సమగ్రతల విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు జీ-20 పోరాడుతోందని ఆయన అన్నారు. కొన్ని ప్రధాన సమస్యలపై సమష్టిగా కృషి చేయకుంటే జీ20 ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రపంచ నేతలు గుర్తించాలని సూచించారు.  జీ-20 సదస్సు అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఓ ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది.

వాతావరణ మార్పుల తీవ్రతను డిక్లరేషన్‌ నొక్కిచెప్పింది. ప్రస్తుతమున్న, కొత్తగా తలెత్తుతున్న ముప్పులను ఎదుర్కొనడానికి బహుముఖ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని డిక్లరేషన్‌ పిలుపిచ్చింది. సూడాన్‌, కాంగో, పాలస్తీనా, ఉక్రెయిన్‌ల్లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతి స్థాపన కోసం మనందరం కలిసి కృషి చేయాలని డిక్లరేషన్‌ పిలుపిచ్చింది.