పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో పాటించాల్సిన విధివిధానాలను నిర్దారిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం విడుదల చేసిన జీవో 46 భవిత్యం పట్ల రాజకీయ వర్గాలలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని వార్డు సభ్యుల రిజర్వేషన్లు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, ఆర్థిక, కుల (ఎస్ఈఈఈపీసీ) సర్వే-2024 ఆధారంగా ఖరారు చేయాలని జీవోలో పేర్కొన్నారు.
సర్పంచ్ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెకల ఆధారంగా, బీసీలకు మాత్రం ఎస్ఈఈఈపీసీ సర్వే ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించాలని పేర్కొన్నారు. ఒకే రిజర్వేషన్ ప్రక్రియ లో రెండు వేర్వేరు కాలాల జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయం లో ఎస్ఈఈఈపీసీ సర్వేకు చట్టబద్ధత ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
ఈ జీవో హైకోర్టు న్యాయ సమీక్షకు నిలుస్తుందా? అనే అనుమానాలూ వస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నుంచి తప్పించుకోవడానికే ఈ జీవోను తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జీవోలో మార్గదర్శకాలను పొందుపర్చారు. ఎస్టీ రిజర్వేషన్లు తొలు త ఖరారు చేసి, ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు కేటాయించాలి. రొటేషన్ పద్ధతిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో (2019) రిజర్వ్ చేసిన వార్డులు/సర్పంచ్ పదవులను తిరిగి అదే వర్గానికి మళ్లీ రిజర్వ్ చేయకూడదు. ఎస్టీ జనరల్, ఎస్టీ (మహిళలు), ఎస్సీ జనరల్, ఎస్సీ (మహిళలు), బీసీ జనరల్, బీసీ (మహిళలు), జనరల్, జనరల్ (మహిళలు)ను ప్రత్యే క క్యాటగిరీలుగా పరిగణించాలి. రిజర్వేషన్ల కేటాయింపులో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అవరోహణ క్రమంలో పరిగణించాలి.మిగిలిన రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ క్యాటగిరీల లో సగం స్థానాలను మహిళలకు కేటాయించాలి. ఇందులో 0.5ను సున్నాగా పరిగణించాలి. మహిళా రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేయాలి. షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్ర త్యేక నిబంధనలు పెట్టారు. షెడ్యూల్డ్ ప్రాం తాల్లో రిజర్వేషన్లు ఆయా వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉంటాయి.
100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్లను ఎస్టీలకే కేటాయించాలి. హైదరాబాద్, మేడ్చల్-మలాజిగిరి జిల్లాలు మినహా 31 జిల్లాల్లో ఈ మార్గదర్శకాల ప్రకారం చర్య లు తీసుకోవాలని పేర్కొన్నారు. బీసీలకు 23, ఎస్సీ 17 నుంచి 19, ఎస్టీ 8 నుంచి 9 % రిజర్వేషన్లను కేటాయించే అవకాశం ఉన్నది.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46పై రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా స్పందిస్తూ ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించిన ప్రభుత్వం, ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టకపోవడం రాజకీయ నైతికతకు విరుద్ధమని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను పరిశీలించి రిజర్వేషన్ శాతం నిర్ణయించాలి.
కానీ ప్రభుత్వం ఆ ప్రక్రియను పక్కనపెట్టి తొందరపాటు తీరు ప్రదర్శించిందని కృష్ణయ్య అంటున్నారు. రిజర్వేషన్లపై నిజమైన డేటాను ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు, బీసీల శాతాన్ని తగ్గించే అవకాశాలను సృష్టించిందని విమర్శలు కొనసాగుతున్నాయి. జీవో 46ను వెంటనే రద్దు చేసి, కొత్తగా స్పష్టమైన, సామాజికంగా న్యాయమైన రిజర్వేషన్ ప్రణాళికను రూపొందించాలని కృష్ణయ్య ప్రభుత్వం వద్ద డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు తాము సిద్ధమని కూడా హెచ్చరించారు. ప్రస్తుత జీవోతో బీసీ వర్గాలు అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విషయంలో మరింత వెనుకబడే అవకాశముందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం ఒక పరిపాలనా చర్య కాదు—అది బీసీల భవిష్యత్తును ప్రభావితం చేసే పెద్ద రాజకీయ అడుగు అని వారు అభిప్రాయపడుతున్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన స్పష్టత ఇవ్వాలని, పారదర్శక అధ్యయనం చేసి తిరిగి సమీక్షించాలని వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరింత వేడెక్కే అవకాశం ఉంది.
More Stories
రాహుల్, ఖర్గే పార్లమెంటులో క్షమాపణలు చెప్పాలి
అన్ని పార్టీల అధ్యక్షులకంటే చిన్నవాడు నితిన్ నబిన్
సిడ్నీ ఉగ్రదాడిలో పాక్ సంతతి తండ్రి, కొడుకులు