పోలవరం నిర్మాణ తీరును పరిశీలించిన కేంద్ర బృందం

పోలవరం నిర్మాణ తీరును పరిశీలించిన  కేంద్ర బృందం
పోలవరం ప్రాజెక్ట్ ను శుక్రవారం కేంద్ర జల సంఘం ప్రతినిధులు పరిశీలించారు.  ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జల సంఘం డిజైన్లు, పరిశోధన విభాగం ఎక్సఫిషియో సభ్యుడు  ఆదిత్య శర్మ, కేంద్ర జల సంఘం   చీఫ్ ఇంజనీర్ ఎస్ ఎస్ భక్షిలతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం ప్రాజెక్టును సందర్శించారు.  ప్రాజెక్ట్ లో జరుగుతున్న పనులను వారు  ఆసాంతం పరిశీలించారు. 
 
వారికి  జలవనరుల శాఖ ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ఎస్ ఈ కె రామచంద్ర రావు, క్వాలిటీ కంట్రోల్ విభాగం సిఈ కె శేషుబాబు, డీఈలు కె బాలకృష్ణ, డి . శ్రీనివాస్, ప్రేంచంద్ ,  ఎం ఈ ఐ ఎల్  జిఎం ఏ గంగాధర్, డిజీఎం మురళి తదితరులు పనులు జరుగుతున్న తీరును చూపించటంతో పాటు వివరాలు అందించారు.   పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుంచి మొత్తం పనుల వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులు వివరించారు. 
 
ఆ తర్వాత వారు మోడల్ డ్యామ్ పరిశీలించారు. అక్కడ ప్రతి విభాగం గురించి అధికారులు తెలిపారు.  స్పిల్ వే చేరుకున్న కేంద్ర బృందం  మొత్తం పరిశీలించింది.  స్పిల్ వే, గేట్లు,  గేట్లను ఆపరేట్ చేసే సిలిండర్లు, పవర్ పాక్స్ మొదలైన వాటి పనితీరు గురించి వారు  తెలుసుకున్నారు.  ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్ కాఫర్ డాం,  గ్యాప్ 1, డయాఫ్రమ్ వాల్,  జల విద్యుత్ కేంద్రం పనులను  పరిశీలించారు. ప్రతి ఒక్క దగ్గర అధికారులను అడిగి పనుల వివరాలు  తెలుసుకున్నారు.