కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి

కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి
ఈ- కార్‌ రేసింగ్‌ కేసులో కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతిలిచ్చారు. ఆయనను ఏసీబీ విచారించేందుకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ-కార్ రేసింగ్​లో 4 సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఈ విచారణ జరుపుతోంది.  ఈ కేసులో కేటీఆర్‌ పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వలాంటూ గవర్నర్​ను ఏసీబీ అనుమతి కోరింది.
దానిని పరిశీలించిన గవర్నర్ తాజాగా కేటీఆర్ విచారణకు అనుమతి జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత చార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్‌ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు.
ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌పై 2022 అక్టోబరు 25న ఒప్పందం కుదిరింది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌, పురపాలక శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9, 10, 11, 12వ సీజన్ల కార్‌ రేస్‌లు హైదరాబాద్​లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్‌లో తొమ్మిదో సీజన్‌ రేసింగ్‌ నిర్వహించారు. 
 
తదుపరి ఏడాది 10 వ సీజన్​ నుంచి ఏస్​ నెక్ట్స్​జెన్ అకస్మాత్తుగా తప్పుకుంది. దాంతో ప్రమోటర్​గా హైదరాబాద్ మెట్రో డెవలప్​మెట్ అథారిటీ (హెచ్​ఎండీఏ)నే పోషించాలని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు 54.88 కోట్లను ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్ఎండీఏ నేరుగా బదిలీ చేసింది.  ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి తెరలేపింది.
హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. ఈ మేరకు ఏసీబీ విచారణ జరిపింది. ఈ చెల్లింపులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ గత ఏడాది డిసెంబర్​లో విచారణ ప్రారంభించింది. రేసింగ్​లో అవకతవకలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఇందులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి పేర్లను చేర్చింది. ఇందులో కేటీఆర్​ను ఏసీబీ ఇప్పటివరకు 2 సార్లు నోటీసులు జారీచేసి విచారించింది.