రాజధాని ఢాకా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ రెండు రోజులపాటు బంద్ ప్రకటిస్తున్నట్లు అవామీ లీగ్ ప్రకటించింది. దాంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది.
షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ఇల్లు ఉన్న ధన్మొండి 32 సహా పలు ప్రాంతాల్లో హసీనా మద్దతుదారులు రహదారులను దిగ్బంధించారు. నివాసాలు, దుకాణాలపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ను ప్రయోగించాల్సి వచ్చింది. దాంతో ఆ దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో పరారీలో ఉన్న షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు, ప్రకటనలకు సంబంధించిన విషయాలను ప్రచారం చేయొద్దని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్ మీడియా సంస్థలను హెచ్చరించింది. దేశంలో శాంతిభద్రతల దృష్ట్యా హింస, నేర కార్యకలాపాలను ప్రేరేపించే హసీనా వ్యాఖ్యలను ప్రసారం చేయొద్దని తెలిపింది.
ఇవి సైబర్ భద్రతా ఆర్డినెన్స్ నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తాయని పేర్కొంది. ఆ వార్తలను ప్రసారం చేసేవారికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని పదవి వీడిన షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చారు.
అప్పటి నుంచి ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. స్వదేశంలో ఆందోళనల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆమెపై కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ఐసీటీ సోమవారం హసీనాను దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె ఖండించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు.

More Stories
బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం కోరుకుంటున్న యూనుస్
షేక్ హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష
అవినీతికి వ్యతిరేకంగా దద్దరిల్లిన ఫిలిప్పీన్స్ రాజధాని