ఢిల్లీ పేలుడుకు నేపాల్ లో మొబైళ్లు, కాన్పూర్ లో సిమ్ లు

ఢిల్లీ పేలుడుకు నేపాల్ లో మొబైళ్లు, కాన్పూర్ లో సిమ్ లు
 
సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ ఢిల్లీ పేలుడుకు నాలుగు వారాల ముందే పూర్తి బ్లూప్రింట్ రూపొందించినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దాడి కోసం అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించేందుకు అతను నేపాల్‌కు వెళ్లి పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పేలుడు పరికరాల రిమోట్ ఆపరేషన్, ట్రేస్ కాకుండా ఉండే కమ్యూనికేషన్ కోసం పాత మొబైళ్లను ఉపయోగించే కుట్రను ఉమర్ ముందుగానే సిద్ధం చేసుకున్నాడన్నది దర్యాప్తులో తెలిసింది. 

అదే సమయంలో, కాన్పూర్‌లో భారీ సంఖ్యలో సిమ్ కార్డులను అతడు కొనుగోలు చేసినట్టు విచారణలో బయటపడింది. నేపాల్‌ లో ఏడు సెకెండ్‌ హ్యాండ్‌ ఫోన్లను, దాదాపు 17 సిమ్‌ కార్డులను ఉపయోగించినట్లు తేలింది.  ఈ సిమ్‌లను తీసుకునేందుకు నకిలీ గుర్తింపు కార్డులు ఉపయోగించారని అధికారులు వెల్లడిస్తున్నారు.  అందులో ఆరు సిమ్‌ కార్డులను ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ లోని బెకాన్‌గంజ్‌ అడ్రెస్‌తో తీసుకున్నట్లు తేలింది. 

ఈ ఐడి కార్డులు రూపొందించడంలో సహకరించిన వ్యక్తుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు. విభిన్న రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సిమ్‌లు, మొబైళ్లతో ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను దాచిపెట్టడానికి విస్తృత కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో, పేలుళ్లకు ముందు దేశంలోని పలు నగరాల్లో అతడి సంచారం కూడా ఇప్పుడు విచారణలో కీలకాంశంగా మారింది.

పేలుడు రోజులకు ముందు ఉమర్‌తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్‌లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరిలో ఒకరైన డాక్టర్ పర్వేజ్, కేసులో ఇప్పటికే నిందితురాలిగా ఉన్న డాక్టర్ షహీన్ సోదరుడిగా తేలింది. ఈ వైద్యుల పాత్ర ఏమిటి, వారు ఉగ్రవాదులకు వైద్య సహాయం అందించారా? లేదా పేలుడుకు సంబంధించిన ఇతర కార్యకలాపాల్లో భాగస్వాములా? అనే కోణాల్లో విచారణ నడుస్తోంది.

మరోవైపు డాక్టర్‌ పర్వేజ్‌ కాన్పూర్‌ వెళ్లినప్పుడు తన స్నేహితులను కలిసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాన్పూర్‌లోని కల్నల్‌గంజ్‌, జీఎస్‌వీఎం మెడికల్‌ కాలేజీ, బాబుపూర్వా, మంధానాలోని స్నేహితులను కలిసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.  ఇక ఢిల్లీ పేలుళ్లకు మాస్టర్‌ మైండ్‌ అయిన లేడీ డాక్టర్‌ షాహీన్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో కాన్పూర్‌ వెళ్లినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. 

వారు ఎవరెవరిని కలిశారన్నదానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఆరోగ్య రంగానికి చెందిన వ్యక్తులు ఉగ్ర నెట్‌వర్క్‌లో భాగస్వాములయ్యారన్న అనుమానతో ఈ కేసు మరింత క్లిష్టమవుతోంది. ఈ కొత్త వివరాల వెలుగులో, ఢిల్లీ పేలుడు కేసు దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద కుట్రగా రూపుదాల్చింది.