42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి

42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి
 
“రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది. పార్టీపరంగా బీసీ కోటా అమలు చేస్తామంటే సర్కారుపై యుద్ధం తప్పదు” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్‌ ఆర్‌ కృష్ణయ్య హెచ్చరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చటబద్ధత క్పలించిన తర్వాతే చట్టపరంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కాంగ్రెస్‌ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద బీసీల న్యాయసాధన దీక్ష చేపట్టారు.

రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు విషయమై తాను ప్రధాని మోదీతో చర్చిస్తానని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు. 42% రిజర్వేషన్లను కల్పించడం న్యాయసమ్మతమైన డిమాండ్‌ అని పే ర్కొన్నారు. కేంద్రంలోని అన్ని పార్టీలను ఏకాభిప్రాయానికి తేవాలని, అప్పుడే పార్లమెంట్‌లో రిజర్వేషన్ల బిల్లు పాస్‌ అవుతుందని చెప్పారు. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకూ బీసీలు పోరాడాలని పిలుపునిచ్చారు.

బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో రాజ్యాంగ సవరణకు అందరూ మద్దతు పలకాలని కృష్ణయ్య కోరారు. పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలను నిర్వహించేందుకు క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకోవాలని భావించడం బీసీలకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. 

రిజర్వేషన్లను సాధించుకునేంత వరకూ బీసీలంతా ఐక్యంగా పోరాడాలని  పిలుపిస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని కృష్ణయ్య కోరారు. తొందరపడి ఎన్నికలకు వెళ్లడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని జిల్లాల్లో బీసీ, కుల, ఇతర ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. నిరాహార దీక్షలు, ధర్నాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగం ప్రకారం సమాజంలోని అన్నివర్గాలకు సమానమైన హక్కులు దక్కాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌ రమణ కోరారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలు పక్కనబెట్టి బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ నాయకులు గొరిగె మల్లేశ్‌, శివకుమార్‌, అనంతయ్య, రాజేందర్‌, సతీశ్‌, మోదీరాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు.