రజినీకాంత్‌, బాలకృష్ణలకు కేంద్రం అరుదైన గౌరవం

రజినీకాంత్‌, బాలకృష్ణలకు కేంద్రం అరుదైన గౌరవం
ప్రముఖ స్టార్‌ నటులు రజినీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిద్దరినీ ఘనంగా సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో వీరిని సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తెలిపారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో జరిగిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దిగ్గజ నటులు రజినీకాంత్‌, నందమూరి బాలకృష్ణలను సత్కరించనున్నాం. అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా వారు ఎన్నో మంచి కథలను ప్రేక్షకులకు అందించారు. భారతీయ సినిమా పట్ల వారి కృషి, సహకారానికి గుర్తింపుగా ముగింపు వేడుకల్లో వారిని సత్కరించనున్నాం. ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయి’ అని ఎల్‌.మురుగన్‌ తెలిపారు. 

కాగా, సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డుల వేడుక నవంబర్‌ 20 నుంచి 28 వరకూ గోవా వేదికగా జరగనుంది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. రజినీకాంత్‌ ఇటీవలే లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రంలో నాగార్జున, సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, రచితా రామ్‌, ఉపేంద్ర, ఆమీర్‌ ఖాన్‌ వంటి ప్రముఖ నటులు నటించారు. తలైవా ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్‌ 2’లో నటిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్‌ మరో స్టార్‌ బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2 : తాండవం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది.