టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న పరువు నష్టం దావా వివాదం సయోధ్యతో ముగిసింది. తాను గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో తాజాగా నాగార్జున ఈ కేసును ఉపసంహరించుకున్నారు.
గతంలో కొండా సురేఖ ఒక సందర్భంలో అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్య, సమంతల విడాకులకు సంబంధించి రాజకీయ కోణంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ గౌరవానికి భంగం కలిగించాయని భావించిన నటుడు నాగార్జున, ఆమెపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ వివాదాస్పద కథనాలను ప్రచురించిన పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్లు, వ్యక్తులపైనా నాగార్జున న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు.
ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మంగళవారం అర్ధరాత్రి తన ఎక్స్ ఖాతా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ‘నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, దానికి నేను చింతిస్తున్నాను. నాగార్జున గారిని లేదా వారి కుటుంబ సభ్యులను కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనల వల్ల ఏదైనా అపార్థం కలిగితే దానికి నేను చింతిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను’ అని ఆమె ఆ ట్వీట్లో స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని కేవలం రాజకీయ విమర్శల సందర్భంలో వచ్చాయని ఆమె వివరణ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ వివాదాన్ని ఇక కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ దావా విచారణ సమయంలో.. కొండా సురేఖ తరపు న్యాయవాది క్షమాపణల విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నాగార్జున తన కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో దాదాపు ఏడాది కాలంగా నలుగుతున్న ఈ పరువు నష్టం దావా ఎపిసోడ్ సుఖాంతమైంది. న్యాయస్థానం గతంలోనే ఇలాంటి అంశాలపై అక్కినేని కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా రాజకీయ నాయకులకు, ఇతరులకు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం.
More Stories
10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కట్టేందుకు కిషన్ రెడ్డి చొరవ
తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతి కేంద్రం
శంషాబాద్ లో రూ. 3 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు