అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!

అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదురాష్ట్రాల్లోని దాదాపు పది చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్‌లలో అనుమానితులు, వారి సహచరులకు సంబంధించిన స్థలాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేసినట్లుగా ఎన్‌ఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
ఈ కేసు 2023లో నమోదైంది. నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు మహమ్మద్ సోజిబ్ మియాన్, మున్నా ఖలీద్ అన్సారీ, అజ్రుల్ ఇస్లాం, అబ్దుల్ లతీఫ్ పేర్లు ఇందులో ఉన్నాయి. నిందితులు ఫేక్‌ ఐడీలను ఉపయోగించి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. వారికి నిషేధిత అల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్‌లోని అల్-ఖైదా కార్యకర్తలకు నిధులు సేకరించడం, బదిలీ చేసినట్లుగా తేలింది. 
 
ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఎన్‌ఐఏ నవంబర్ 10, 2023న అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటిఎస్) నిషేధిత ఉగ్రవాద సంస్థలు అల్-ఖైదా, భారత ఉపఖండంలోని అల్-ఖైదాతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ పుణేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అరెస్టు చేసింది. 
 
ఏటీఎస్‌ థానేకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ప్రశ్నించింది. అక్టోబర్ 27న ఏటీఎస్‌ 37 ఏళ్ల జుబైర్‌ హంగర్గేకర్‌ను అరెస్టు చేసింది. అతను నిషేధిత సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాడని, రాడికలైజేషన్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఆరోపణలున్నాయి. దర్యాప్తులో ఏటీఎస్‌ అతని పాత్రతో పాటు పాకిస్తానీ కాంటాక్ట్ నంబర్‌ను గుర్తించారు.