ఢిల్లీ పేలుడులో సూత్రధారులు ఐదుగురు వైద్యులు!

ఢిల్లీ పేలుడులో సూత్రధారులు ఐదుగురు వైద్యులు!

* ఢిల్లీ పేలుడు మాస్టర్‌ మైండ్‌  మౌల్వీ?

గడిచిన రెండు, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్రకుట్రకు ఢిల్లీ కారు పేలుడుతో లింక్‌ ఉండటమే కాకుండా, ఈ భారీ కుట్రలో ఉన్నత విద్యావంతులైన ఐదుగురు డాక్టర్లు కీలక సూత్రధారులుగా తేలడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నది. పుల్వామాకు చెందిన డా. ఉమర్‌ నబీ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు.  ఉమర్‌ తండ్రి నబీ భట్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదేండ్ల కిందట ఉద్యోగం నుంచి వైదొలిగారు. 

శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్‌ ఎంబీబీఎస్‌, ఎండీ (మెడిసిన్‌) పూర్తి చేశాడు. కొన్నాళ్లు జీఎంసీ అనంత్‌నాగ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాలలో అసిస్ట్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాడు. సోషల్‌మీడియాలో తీవ్రవాద భావజాలానికి బాగా ఆకర్షితుడయ్యాడు.  కారు పేలుడు కుట్రకు ముందు శుక్రవారం తన తల్లికి ఫోన్‌ చేసిన ఉమర్‌ లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నానని, తనకు ఫోన్‌ చేయవద్దని చెప్పాడు.

డాక్టర్‌ ముజమ్మిల్‌ గనీ పుల్వామాలోని కోలికి చెందిన ముజమ్మిల్‌ ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ దవాఖానలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. ఇతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు 358 కిలోల అమ్మోనియమ్‌ నైట్రేట్‌, పలు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్నారు.  అద్దెకు తీసుకొన్న గదిలో ముజమ్మిల్‌ బాంబులను తయారు చేసినట్టు అనుమానిస్తున్నారు. లక్నోకు చెందిన మహిళా డాక్టర్‌ షాహిన్‌ కూడా ఈ ఉగ్ర కుట్రలో భాగమయ్యారు. ఈమె ముజమ్మిల్‌కు ప్రేయసిగా భావిస్తున్నారు.

కశ్మీర్‌లోని కుల్గామ్‌ నుంచి యూపీలోని సహారన్‌పూర్‌కు మకాం మార్చిన డాక్టర్‌ అదిల్‌ అహ్మద్‌ రాథర్‌ అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ దవాఖానలోనే ముజమ్మిల్‌, ఉమర్‌తో కలిసి వైద్యుడిగా పని చేస్తున్నాడు. జీఎంసీ శ్రీనగర్‌లోని ఇతని లాకర్‌ నుంచి ఏకే-47ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చైనా నుంచి ఎంబీబీఎస్‌ డిగ్రీ తెచ్చుకొన్న డాక్టర్‌ అహ్మద్‌ మొహీయుద్దీన్‌ సయ్యద్‌ హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. రాజేంద్రనగర్‌లో షవర్మా బిజినెస్‌ కూడా నడుపుతున్నాడు. సోషల్‌మీడియాలో తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఇతరులకు భోదనలు చేసేవాడు.

అరెస్టయిన నలుగురు డాక్టర్లలో లేడీ డాక్టర్‌ షాహిన్‌ కూడా ఉండడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ షాహిన్‌ సయీద్‌ ఢిల్లీ కారు పేలుడుకు నిధులు సమకూర్చడంతోపాటు, ఆపరేషన్‌ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌-మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివిన డాక్టర్‌ ఉమర్‌తో షాహిన్‌ చేతులు కలిపినట్లు తెలిపాయి. 

సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రెడ్‌ ఫోర్ట్‌ సమీపంలో పేలిపోయిన కారును నడుపుతున్నది డాక్టర్‌ ఉమర్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్న ముజామిల్‌తో కూడా షాహిన్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

పేలుడుకు పథక రచన చేసిన ప్రధాన ఉగ్ర గ్రూపుతో వీరిద్దరికీ ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు వారు చెప్పారు. భారత్‌తో మానసిక యుద్ధం చేసేందుకు ఓ మహిళా బ్రిగేడ్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నిషిద్ధ ఉగ్ర గ్రూపు జైషే మొహమ్మద్‌ దాని నాయకురాలిగా షాహిన్‌ను నియమించిందని, భారత్‌లో జైష్‌ కోసం మహిళలను నియమించే బాధ్యతను షాహిన్‌ పర్యవేక్షిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. 

జమ్ము కశ్మీరును పలుమార్లు సందర్శించిన డాక్టర్‌ షాహిన్‌కి ఈ దాడి గురించి ముందే తెలియడమేగాక ఇందుకు నిధులు సమకూర్చడంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలిపాయి. షాహిన్‌ రూ.35-40 లక్షలు సేకరించినట్లు వారు చెప్పారు. మరోవంక, కారు పేలుడు సంభవించడానికి కొన్ని గంటల ముందు పోలీసులు ఛేదించిన ఫరీదాబాద్‌ వైట్‌ కాలర్‌ ఉగ్ర మాడ్యూల్‌ వెనుక కీలక పాత్రధారిగా జమ్ము కశ్మీరులోని షోపియాన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్‌ ఉన్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. 

వైద్య విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడంలో మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్‌ కీలక పాత్రను పోషించాడు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ)లో పారా మెడికల్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్‌కు విద్యార్థులందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. నౌగామ్‌ మసీదులో కూడా అతను ఇమామ్‌గా ఉన్నాడని నిఘా వర్గాలు వెల్లడించాయి.  మౌల్వీకి చెందిన గదుల నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్‌ ముజమ్మిల్‌ని జమ్ము కశ్మీరు పోలీసులు అరెస్టు చేశారు.

ఫరీదాబాద్‌లో వీరు అద్దెకు తీసుకున్న గదుల నుంచే 350 కిలో అమ్మోనియం నైట్రేట్‌, ఆయుధాలు, బాంబు తయారీ సామగ్రి, ఏకే 47 రైఫిల్‌, 2,563 కిలోల అనుమానాస్పద పేలుడు పదార్థాలను భద్రతా సంస్థలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి.  వైద్య విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడంలో మౌల్వీ కీలకంగా వ్యవహరించాడు. జైషేతో స్ఫూర్తి పొందిన మౌల్వీ విద్యార్థులకు వీడియోలు చూపించేవాడు. వీఓఐపీ ద్వారా అఫ్ఘానిస్థాన్‌లో ఎవరితోనో మాట్లాడేవాడని నిఘా వర్గాలు తెలిపాయి.