మహారాష్ట్ర బీటలు వారుతున్న ఇండియా కూటమి

మహారాష్ట్ర బీటలు వారుతున్న ఇండియా కూటమి
 
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మహారాష్ట్రలో ఇండియా కూటమి బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ తమ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. 

ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్.. అధిష్ఠానానికి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలిపారు. దానికి అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ముంబైతో పాటు 246 మున్సిపల్ కౌన్సిల్స్, 42 నగర పంచాయతీల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు.

కాగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) మధ్య ఇటీవల సాన్నిహిత్యం  పెరుగుతున్న సంగితి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎంఎన్ఎస్ ఇండియా కూటమిలో చేరితే మైనారిటీ, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఓట్లు దూరమవుతాయని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒంటరిగా పోటీ చేసేందుకు అడుగుల ముందుకు వేస్తున్నట్లు సమాచారం.

కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండియా కూటమి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. శివసేన (ఉద్ధవ్) పార్టీ ప్రతినిధి ఆనంద్ దూబే ఘాటుగా స్పందించారు. హర్యానా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చేసిందని గుర్తుచేశారు. ఇతర పార్టీలపై వ్యాఖ్యలు చేసేందుకు కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. శివసేన (ఉద్ధవ్) కూడా ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
 
మరోవైపు, ప్రత్యర్థి కూటమిలో కుంపట్లపై అధికార బీజేపీ ఘాటు విమర్శలు చేసింది. మహావికాస్ అఘాడీ పూర్తిగా గందరగోళంలో పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దారేకత్ ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ లాగే, రాజ్ ఠాక్రే కూడా హిందుత్వ సిద్ధాంతాలకు దూరమవుతున్నారని ఆరోపించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నా అధికార పక్షంపై కలిసికట్టుగా పోరాడాలని కూటమి పార్టీలను కోరుతోంది కాంగ్రెస్. 
 
ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత నానా పాటోల్ విమర్శలు గుప్పించారు. ముంబై, నవీ మంబై, థాణెల్లో అధికార పక్షం భూ కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్డీఏ స్కామ్‌లను ఎండగట్టేందుకు శరద్ పవార్ కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. ఇటీవల శరద్ పవార్, కాంగ్రెస్‌ను బలహీన పరుస్తున్నారని ఆరోపించిన నానా పాటోల్ తాజాగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం.