దేశంలో భారీ ఉగ్ర‌కుట్ర భ‌గ్నం.. గుజరాత్ లో ముగ్గురు అరెస్ట్‌

దేశంలో భారీ ఉగ్ర‌కుట్ర భ‌గ్నం.. గుజరాత్ లో ముగ్గురు అరెస్ట్‌

* హైదరాబాద్ వ్యక్తి డా. అహ్మద్ మొహియుద్దీన్ కూడా అరెస్ట్

దేశంలో భారీ ఉగ్ర‌కుట్ర‌ను గుజ‌రాత్ యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ భ‌గ్నం చేసింది. ఈ మేర‌కు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. వారికి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాలు స‌రఫ‌రా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వారిపై ఉన్నాయ‌ని ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. ఈ మేర‌కు ఏడాది కాలంగా వారిపై నిఘా ఉంచిన‌ట్లు వెల్ల‌డించారు.

నిందితుల వద్ద నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో ఒకడైన డా. అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని గుజరాత్ డీఐజీ సునిల్ జోషి తెలిపారు. మరో ఇద్దరు నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు. 

అహ్మద్ మొహియుద్దీన్ ఇప్పటికే పలు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు. అహ్మదాబాద్‌కు అతడు వస్తున్నట్టు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

36 ఏళ్ల వయసున్నఅహ్మద్ మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దేశంలో పెద్ద ఎత్తున నష్టం కలిగించే ఉగ్రదాడి చేయాలని అహ్మద్ మొహియుద్దీన్ భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పలువురు విదేశీయులతోనూ టచ్‌లో ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా ఓ ఉగ్రసంస్థతో అతడు సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాల నుంచి రైసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు.


గుజరాత్‌లోని కాలోల్‌ నుంచి ఆయుధాలు తీసుకుని మరో ప్రాంతానికి వెళ్తుండగా అహ్మద్ మొహియుద్దీన్ చిక్కినట్టు పోలీసులు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను గుజరాత్‌లోని బనస్కాంతలో అరెస్టు చేశారు. ఉగ్రవాదానికి వీరు బాగా ప్రభావితమైనట్లు గుర్తించారు.
వీరిద్దరు కూడా విదేశాల్లోని పలువురితో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడుల కోసం ఇప్పటికే దిల్లీ, అహ్మదాబాద్‌, లఖ్‌నవూలో రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు.
కశ్మీర్‌లోనూ వీరి కదలికలు నమోదైనట్లు చెప్పారు. నిందితులతో సంబంధం ఉన్న వారిని సైతం గుజరాత్ ఏటీఎస్ విచారిస్తోంది.  ఈ ఏడాది ప్రారంభంలో అల్ ఖైదా ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న ఐదుగురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. నిందితుల్లో బెంగళూరుకు చెందిన ఓ మహిళ సైతం ఉంది. ఆన్లైన్ వేదికగా ఆ మహిళ టెర్రర్ మాడ్యూల్ను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పాక్లోని ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్టు తెలిపారు. 
ఇదిలా ఉండగా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో జమ్మూకశ్మీర్లోని కథవా జిల్లాలో ఇద్దరు ఎస్పీవోలపై అధికారులు వేటు వేశారు. ఉగ్రవాదుల కార్యకలాపాలకు వీరు సాయం చేస్తున్నట్లు తేలడంతో విధుల నుంచి తొలగించామని అధికారులు పేర్కొన్నారు. ఎస్పీవోలైన అబ్దుల్ లతీఫ్, మహ్మద్ అబ్బాస్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం దోడా జైలుకు తరలించినట్లు తెలిపారు.