ఆర్ఎస్ఎస్ నమోదు కాకపోయినా చట్టబద్ధ సంస్థే!

ఆర్ఎస్ఎస్ నమోదు కాకపోయినా చట్టబద్ధ సంస్థే!

* పాక్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలి

దేశానికి సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ సంఘ్ “నమోదు కాని సంస్థ”గా ఎందుకు మిగిలిపోయిందని ప్రశ్నించిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఆదివారం తీవ్రంగా స్పందించారు.  భారతదేశ స్వాతంత్ర్యానికి చాలా ముందు 1925లో  ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని చెబుతూ  ఆ సమయంలో ఆ సంస్థ బ్రిటిష్ ప్రభుత్వం కింద నమోదు అయి ఉంటుందని విమర్శకులు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. 
 
“సంఘ్ 1925 లో ప్రారంభమైందని మీకు తెలుసా? మేము బ్రిటిష్ ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకున్నామని మీరు అనుకుంటున్నారా? దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము? స్వాతంత్ర్యం తరువాత, స్వతంత్ర భారత్‌లోని చట్టాలు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయలేదు. వ్యక్తుల నమోదు కాని సంస్థలకు కూడా చట్టపరమైన హోదా ఇచ్చారు. కాబట్టి మమ్మల్ని అలా వర్గీకరించారు.  ఒక సంస్థగా గుర్తించారు” అని భగవత్ బెంగళూరులో “100 సంవత్సరాల సంఘ ప్రయాణం: న్యూ హారిజన్స్” ఉపన్యాస శ్రేణిలో తెలిపారు.
 
ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు ఆర్ఎస్ఎస్ ను వ్యక్తుల సంఘంగా పేర్కొన్నాయని,  సంస్థను ఆదాయపు పన్ను నుండి మినహాయించారని చెప్పారు. “మమ్మల్ని మూడుసార్లు నిషేధించారు. అంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. మేము లేకపోతే, వారు ఎవరిని నిషేధించేవారు? ప్రతిసారీ, నిషేధాన్ని కోర్టులు కొట్టివేసాయి” అని గుర్తు చేశారు. 
 
“ఆర్ఎస్ఎస్ ను  చట్టపరమైన సంస్థగా కోర్టులు గుర్తించాయి. పార్లమెంటులో, ఇతర చోట్ల అనేక ప్రశ్నలు లేవనెట్టారు. చట్టబద్ధంగా, మేము ఒక సంస్థ; మేము రాజ్యాంగ విరుద్ధం కాదు. కాబట్టి, హిందూ ధర్మం ‘రిజిస్టర్డ్’ కానప్పటికీ, రిజిస్ట్రేషన్ అవసరం లేదు” అని స్పష్టం చేశారు. 
 
ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ప్రభుత్వ సంస్థలు, బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆయన సంస్థ రిజిస్ట్రేషన్ స్థితిని ప్రశ్నించగా, దాని నిధుల వనరులకు సంబంధించి పారదర్శకతను కోరింది.
 
ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ జెండాలను మాత్రమే గౌరవించడం,  భారతీయ త్రివర్ణాన్ని గుర్తించకపోవడం అనే అంశంపై స్పందిస్తూ  ఆర్‌ఎస్‌ఎస్‌ లో కాషాయ రంగును గురువుగా పరిగణించినప్పటికీ, భారతీయ త్రివర్ణ పతాకాన్ని దానికి అధిక గౌరవం ఉందని భగవత్ స్పష్టం చేశారు. “మేము ఎల్లప్పుడూ మన త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తాము, నివాళులు అర్పిస్తాము, రక్షిస్తాము” అని తేల్చి చెప్పారు. 
 
కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌ లో హిందువులు మాత్రమే అనుమతీస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, హిందూ మతం ఒక మతం కాదని, భారతదేశానికి చెందిన ఎవరైనా హిందువులేనని భగవత్ తేల్చి చెప్పారు.  బ్రాహ్మణులు, ముస్లింలు లేదా క్రైస్తవులు తమ “వేర్పాటు”ని వదిలి “భారత మాత కుమారులు”గా వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలలో చేరడానికి స్వాగతం అని భగవత్ ప్రకటించారు.
 
“సంఘంలో బ్రాహ్మణులకు అనుమతి లేదు. సంఘ్‌లో ఇతర కులాలకు అనుమతి లేదు. ముస్లింలకు అనుమతి లేదు, సంఘ్‌లో క్రైస్తవులకు అనుమతి లేదు. హిందువులకు మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి వివిధ తెగల ప్రజలు – ముస్లింలు, క్రైస్తవులు, ఏదైనా తెగ – సంఘ్‌లోకి రావచ్చు కానీ మీ వేర్పాటును దూరంగా ఉంచుకోవచ్చు” అని ఆయన సూచించారు. 
 
“మీ ప్రత్యేకత స్వాగతించదగినది. కానీ మీరు శాఖలోకి వచ్చినప్పుడు, మీరు భారత మాత కుమారుడిగా, ఈ హిందూ సమాజంలో సభ్యుడిగా వస్తారు. ముస్లింలు శాఖకు వస్తారు, క్రైస్తవులు శాఖకు వస్తారు. సాధారణంగా హిందూ సమాజం అని పిలువబడే అన్ని ఇతర కులాల మాదిరిగానే, వారు కూడా శాఖకు వస్తారు. కానీ మేము వారిని లెక్కించము. వారు ఎవరు అని అడగము. మనమందరం భారత మాత కుమారులం. సంఘం అలా పనిచేస్తుంది…” అని డా. భగవత్ వివరించారు.
 
 రామ మందిరాన్ని నిర్మించడానికి పార్టీ చొరవ తీసుకున్నందున  ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపికి మద్దతు ఇచ్చిన్నట్లు  భగవత్ తెలిపారు. అయితే,  సంఘ్ మద్దతు ఓ ప్రత్యేక పార్టీకి, వ్యక్తులకు ఉండదని, వారు అనుసరించే విధానాలకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. దేశం హితంకోసం ఎవ్వరు పనిచేసినా, దేశానికీ అవసరమైన విధానాలను ఎవ్వరు చేపట్టినా తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తేల్చి చెప్పారు. 
 
స్వయంసేవక్ లు ఏ పార్టీలో అయినా చేరవచ్చని, తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే కొన్ని పార్టీలు తమను వ్యతిరేకిస్తున్నాయని, మరొకొందరు తమకు ప్రవేశం లేదని చెబుతున్నాయని, అటువంటప్పుడు ఒక పార్టీ మాత్రమే వారిని ఆహ్వానిస్తున్నదని గుర్తు చేశారు.  

పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలని డా.  భాగవత్‌ సూచించారు. నిజాయితీ గల స్నేహితునిగా భారత్‌కు సహకరించటం ద్వారానే దాయాదికి మేలు జరుతుందని ఆయన హితవు చెప్పారు. పాకిస్థాన్‌కు నష్టం జరిగేలా భారత్‌ ప్రతిసారి ఓడించాలని పేర్కొంటూ దానివల్ల పాకిస్థాన్‌ శాశ్వతంగా పశ్చాతాపం చెందకతప్పదని స్పష్టం చేశారు.

“పాకిస్థాన్‌తో ఎల్లప్పుడూ మనం శాంతినే కోరుకుంటాం. పాకిస్థానే మనతో శాంతి కోరుకోవటం లేదు. భారత్‌కు హానిచేయటం ద్వారా ఎంతోకొంత సంతృప్తి చెందినంతకాలం పాకిస్థాన్‌ అలాగే చేస్తూనే ఉంటుంది. పాకిస్థాన్‌తో శాంతికి మార్గం ఏమంటే మనవైపు నుంచి ఉల్లంఘన జరగకూడదు. కానీ శాంతిని పాకిస్థాన్‌ ఉల్లంఘిస్తే అది ఎప్పుడూ విజయం సాధించలేదు. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంతఎక్కువ నష్టపోతుంది” అని హెచ్చరించారు. 

“ఉదాహరణకు 1971 పాకిస్థాన్‌ దండయాత్ర చేసింది. భారత్‌కు 90వేల మంది సైనికులను కోల్పోయింది. ఆ విధంగా వరుసగా జరిగితే పాకిస్థాన్‌ ఒకరోజు పాఠం నేర్చుకుంటుంది. అందువల్ల యుద్ధం చేయటానికి పోటీపడే కంటే మనకు సహకరించమే మేలని అర్థమవుతుంది. వారికి మరో భాష అర్థమవుతుందని అనుకోవటం లేదు. పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే మనం చెప్పాలి” అని తేల్చి చెప్పారు. 

“భారత్‌ను ఏమి చేయలేమనే విషయం పాక్‌కు అర్థంకావాలి. సన్నిహితంగా, స్నేహంగా, నిజాయితీగా, సహకరించటమే మార్గమని అర్థంచేసుకోవాలి. పాక్‌ పదేపదే చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. తగిన విధంగా సమాధానం చెప్పాలి. ఎల్లప్పుడూ ఓడించాలి. నష్టం జరిగిన ప్రతిసారి పశ్చాతాపం చెందుతుంది. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు పాకిస్థాన్‌కు అర్థమవుతుంది” అని మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు.