వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ

వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ

* న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ విజయం

అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు తమ సత్తా చాటారు. యూఎస్‌ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ విజయం సాధించారు. ఇక వర్జీనియాలో జరిగిన ఎల్జీ ఎన్నికల్లో మరో భారత సంతతికి చెందిన మహిళ సత్తా చాటారు.

వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్‌ అభ్యర్థిని గజాలా హాష్మీ విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. హాష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాలా. ఈమె భారత సంతతికి చెందిన మహిళే కాదు, హైదరాబాద్‌ వాసి కూడా.

గజాలా హాష్మీ 1964లో హైదరాబాద్‌లో జియా హాష్మీ, తన్వీర్‌ హాష్మీ దంపతులకు జన్మించారు. తన బాల్యాన్ని మల్‌పేట్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఓ యూనివర్శిటీలో ప్రోఫెసర్‌గా పని చేసేవారు. 

ఇక గజాలా జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు. అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. వివాహం అనంతరం గజాలా 1991లో రిచ్‌మండ్‌ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్‌ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.

అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. తద్వారా అమెరికా ఆర్థిక రాజధానికి మేయర్ కాబోతున్న తొలి ముస్లింగా, తొలి భారత సంతతి వ్యక్తిగా, తొలి ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తిగా జోహ్రాన్ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆండ్రూ క్యువోమోపై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు.

 
గత వందేళ్లలో న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడు జోహ్రాన్ కావడం విశేషం. మమ్దానీ తన ప్రచారం అంతటా డొనాల్డ్ ట్రంప్ సహా రిపబ్లికన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రంప్ ఆయనపై ‘కమ్యూనిస్ట్’ అనే ముద్ర వేశారు. జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్‌ను తాను చేజిక్కించుకుంటానని కూడా ట్రంప్ బెదిరించారు.
 
రచయిత, దర్శకురాలు మీరా నాయర్, విద్యావేత్త మహమూద్ మమ్దానీ దంపతులకు జోహ్రాన్ 1991లో జన్మించారు. ఆఫ్రికా దేశమైన ఉంగాడా రాజధాని కంపాలాలో జన్మించిన జోహ్రాన్ తర్వాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో పెరిగారు. జోహ్రాన్‌కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. దీంతో అప్పటి నుంచి ఆయన క్వీన్స్‌లోనే పెరిగారు.