ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరిగి గెలిస్తే మొహియుద్దీన్నగర్ పేరును మోహన్ నగర్గా మారుస్తానని బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగంగా హామీ ఇచ్చారు. సమస్తిపూర్ జిల్లాలోని మొహియుద్దీన్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ అక్కడే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ఎన్డీఏ విజయం బానిసత్వపు అన్ని గుర్తులను తుడిచి పెడుతుందని ఉద్ఘాటించారు. “సోదరులారా, మొహియుద్దీన్నగర్ పేరును మోహన్నగర్గా మార్చే దిశగా ముందుకు సాగాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది సాధ్యమే. బానిసత్వపు అన్ని గుర్తులను వదిలించుకుందాం. మేము ఉత్తర ప్రదేశ్లో కూడా ఇదే పని చేశాం. అక్కడ ఫైజాబాద్ పేరును అయోధ్యగా, అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చాం” అని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
దృఢమైన నాయకులు అధికారాన్ని చేపట్టినప్పుడు, వారు తమ విశ్వాసలమేరకు పనిచేస్తారని తెలిపారు. అది యువతకు ఉపాధి కల్పించే దిశలో అయినా లేదా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే విషయంలో అయినా సరేనని చెప్పారు.
మొహియుద్దీన్నగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజేష్ కుమార్ సింగ్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఆయన ప్రధాన ప్రత్యర్థి 2015లో ఈ స్థానాన్ని గెలుచుకున్న ఆర్జేడీ నాయకురాలు ఇజ్యా యాదవ్. అయితే బీహార్లో ఇండో-ఇస్లామిక్ మిశ్రమ సంస్కృతికి మూలాలు ఉన్న ప్రదేశాల పేర్లను మార్చాలని బీజేపీ నాయకులు కొంతకాలంగా పట్టుబడుతున్నారు.
కానీ దీనిని ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నెలల క్రితం పాట్నా శివార్లలో ఉన్న నితీష్ కుమార్ స్వస్థలం బఖ్తియార్పూర్ పేరును “నితీష్ నగర్”గా మార్చాలనే బీజేపీ నాయకుల సూచనను నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించారు. అయినా తాజా ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పేరు మార్పు హామీ ఇవ్వడం బీహార్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

More Stories
బిహార్ ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై మరో వివాదం
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన
తండ్రి పేరు చెప్పడానికి ఎందుకు భయం తేజస్వి?