బిలాస్‌పూర్‌ రైలు ప్రమాదంలో 8 మంది మృతి

బిలాస్‌పూర్‌ రైలు ప్రమాదంలో 8 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పుర్‌లో ప్యాసింజర్‌, గూడ్స్‌ రైలు ఎదురెదురుగా ఢీకొనడంతో 8 మంది మృతి చెందగా,  తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు బిలాస్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌ చెప్పారు. సిగ్నల్‌ వ్యవస్థ వైఫల్యం లేదా మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన బిలాస్​పుర్​ సమీపంలోని లాల్​ఖదాన్​ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. గేవ్రా నుంచి బిలాస్​పుర్​ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్​ ట్రైన్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలు ముందు భాగం గూడ్స్​ ట్రైన్​పైకి ఎక్కింది. ఒక బోగీ పూర్తిగా దెబ్బతింది.

వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, రైల్వే యంత్రాంగం ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టాయి. దెబ్బతిన్న రైల్ కోచ్‌ల్లో చిక్కుకున్నవారిని రక్షించాయి. ఈ క్రమంలో నాలుగు మృతదేహాలను వెలికితీశాయి. ఈ దుర్ఘటనపై రైల్వే  భద్రతా కమిషనర్ స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో బిలాస్‌పుర్‌-హావ్‌డా లైన్‌ మార్గంలో రైళ్లరాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది.

దాంతో పలు సర్వీసులను రద్దు చేశారు. మరికొన్నింటిని దారిమళ్లించారు. ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను బిలాస్‌పుర్‌లోని అపోలో ఆస్పత్రి, ఛత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని బిలాస్​పుర్​ జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.

మరోవైపు రైల్వే శాఖ ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వలంగా గాయపడిన వారికి లక్ష చొప్పున పరిహారం ఇవ్వనుంది.