అమెరికాలో 91 శాతం పెరిగిన భారతీయులపై విద్వేషం!

అమెరికాలో 91 శాతం పెరిగిన భారతీయులపై విద్వేషం!
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆ దేశంలో భారత్‌కు చెందిన వారిపై ద్వేషపూరిత నేరాల కేసులు పెరిగాయి. భారతీయులను గెంటేయండి, ఇండియన్‌ గో బ్యాక్‌ నినాదాలతో ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దక్షిణ ఆసియా సంతతికి చెందిన ప్రజలపై ఆన్‌లైన్‌ ద్వేషం, హింస పరిమితంగా ఉండేది. 
 
2024, అక్టోబర్‌ నాటికి 46 వేలు ట్రోలింగ్‌, 884 బెదిరింపు కేసులు నమోదయ్యాయి. అయితే ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టాక పరిస్థితి అధ్వానంగా మారింది. 2025, అక్టోబర్‌ నాటికి 91 శాతం పెరిగి కేసుల సంఖ్య 88 వేలకు చేరుకుంది.  ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత హెచ్‌-1బీ వీసా ఫీజు అనూహ్యంగా పెంచడం, 104 మంది భారతీయులను వెళ్లగొట్టడం వంటివి భారతీయులపై ద్వేషానికి ఆజ్యం పోసినట్లయింది. 

తత్ఫలితంగా కాల్పులు, టెక్సాస్‌, వర్జీనియా, కాలిఫోర్నియాలలో దేవాలయాలపై దాడులు పెరిగాయి. సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ అంచనా ప్రకారం ఇటీవలి నెలల్లో జాత్యహంకార పోస్టులు కూడా వేగంగా పెరిగాయి. ట్రంప్‌ పాలసీల కారణంగా భారతీయులపై జాత్యహంకార, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ విపరీతంగా పెరిగిందని తెలిపింది. కేవలం వ్యాఖ్యలకు పరిమితం కాకుండా ఏకంగా దక్షిణాసియా సమాజాన్నే లక్ష్యంగా చేసుకుని ద్వేష ప్రచారం పెరిగింది‘దేశం నుంచి భారతీయులను వెళ్లగొట్టండి’ నినాదాలు ఎక్కువయ్యాయి.

అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియాలలో వలసదారులపై ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఆగ్రహం జాత్యహంకార ధోరణికి మొదటి ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న మితవాద రాజకీయాల్లో ఈ భావన ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. హెచ్‌-1బీ వీసా విధానం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. తమకు ఆ ఉద్యోగాలకు తగిన అర్హత లేకపోయినప్పటికీ, అమెరికా పౌరుల ఉద్యోగాలను భారతీయులు ఎత్తుకుని పోతున్నారని మితవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.

అమెరికాలో భారతీయ పౌరుల భద్రత పెరుగుతున్న ఆందోళనకరంగా మారింది. ఇటీవల పెరుగుతున్న నేరాలు మరియు జాతి వివక్ష సంఘటనల ధోరణి దీనికి ప్రధాన కారణం. విద్యార్థులు, టెక్ కార్మికులు, వ్యాపార యజమానులు, కళాకారులు సహా వివిధ వృత్తులలోని వ్యక్తులు హింసకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన అనేక మరణాలు, వాటిలో చాలా వరకు తుపాకీ హింసతో సంబంధం కలిగి ఉన్నాయి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ విషాద సంఘటనలు విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులు ఎదుర్కొంటున్న తీవ్రమైన భద్రతా సమస్యలను నొక్కి చెబుతున్నాయి.