ఈ రోజు శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో కూడా గొప్పరోజని, 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కలిసి కొత్తతరం శాస్త్ర సాంకేతిక రంగాలకు మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ పథకాన్ని ప్రారంభించామని, దానికి రూ.లక్ష కోట్ల నిధిని కేటాయించామని తెలిపారు.
“రూ.లక్ష కోట్లు మోదీ వద్దే ఉంటుందని మీరు అనుకోవచ్చు. అందుకే మీరు చప్పట్లు కొట్టడం లేదు. ఈ లక్ష కోట్లు మీ కోసం (శాస్త్రవేత్తలు). ఇది మీ సామర్థ్యాలను పెంపొందించడానికి. ఇది మీ కోసం కొత్త అవకాశాలను తెరవడానికి. ప్రైవేట్ రంగంలో కూడా పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడమే మా ప్రయత్నం” అని ప్రధాని పేర్కొన్నారు.
భారతదేశం హై రిస్క్, అధిక ప్రభావ పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సైన్స్ అండ్ టెక్నాలజీకి శక్తి కేంద్రంగా ఎదగడానికి ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో ఆధునిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి తమ ప్రభుత్వం గణనీయమైన సంస్కరణలను చేపట్టిందని ఆయన వివరించారు.
ఒక దశాబ్దంలో పరిశోధన వ్యయం రెట్టింపు అయ్యిందని పేర్కొంటూ తమ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ, సముపార్జన విధానంలో గణనీయమైన సంస్కరణలు చేసిందని చెప్పారు. ఇది భారత్ ఆవిష్కరణ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వృద్ధి-అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించిందని తెలిపారు.
గత దశాబ్దకాలంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిలలు భాగస్వామ్యం పెరిగిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. “మనం భారత అంతరిక్షం గురించి మాట్లాడుకునేటప్పుడు భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించి తప్పక ప్రస్తావిస్తాము. పేటెంట్ దాఖలులో దశాబ్దం క్రితం ఈ రంగంలో ఏటా మహిళల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు అది ఏటా 5,000లకు పైగా చేరుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెడిసిన్ (ఎస్టిఇఎం) విద్యలో మహిళల వాటా దాదాపు 43 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ” అని ప్రధాని వెల్లడించారు.

More Stories
నిధుల కోసం గాంజా సాగు ప్రోత్సహిస్తున్న మావోయిస్టులు
హర్మన్ప్రీత్ సేనకు బీసీసీఐ రూ. 51 కోట్ల నజరానా
భారత మహిళల జట్టుకు తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం