భారత్‌లో తాలిబన్ తొలి దౌత్యవేత్త నియామకం

భారత్‌లో తాలిబన్ తొలి దౌత్యవేత్త నియామకం
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మరింత పుంజుకోనున్నాయి. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ పాలన తిరిగి ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అక్కడి సర్కారు భారత్‌లో తొలి దౌత్యవేత్తను నియమించబోతుంది. అది కూడా ఈనెలలోనే కాగా ఇది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో కీలక అడుగుగా అంతా బావిస్తున్నారు. 
 
తాలిబాన్ ఈ నెలలో మొదటి దౌత్యవేత్తను నియమించిన తర్వాత డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో మరో దౌత్యవేత్తను నియమించడానికి కాబూల్ భారత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఈక్రమంలోనే గత నెలలో అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారతదేశంలో పర్యటించారు. 
 
ఈ పర్యటన సందర్భంగా కాబూల్‌లోని తన సాంకేతిక మిషన్‌ను రాయబార కార్యాలయం స్థాయికి పెంచాలని భారతదేశం నిర్ణయించింది. అంతేకాకుండా తాలిబాన్ దౌత్యవేత్తలను అంగీకరించడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసింది. త్వరలో ఇరుపక్షాలు తమ తమ మిషన్లకు ఛార్జ్ డి అఫైర్స్ స్థాయి అధికారిని నాయకత్వం వహించేలా చర్యలు తీసుకోనున్నాయి.
 
తాలిబన్ ప్రభుత్వం భారతదేశంలోని యువ ఆఫ్ఘన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కామిల్‌ను ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్‌లో యాక్టింగ్ కాన్సుల్‌గా గత ఏడాది నవంబర్ లో నియమించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్ భారతదేశంలో చేపట్టిన మొదటి నియామకం ఇది.
 
తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా అధికారికంగా గుర్తించనప్పటికీ ఆఫ్ఘానిస్తాన్ కు సహాయం అందించడంలో  భారత్ నమ్మకమైన భాగస్వామిగా తన పాత్రను బలోపేతం చేసుకుంది. నిరంతరాయంగా అందిస్తున్న మానవతా సహాయం, వైద్య సామాగ్రి సరఫరా దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.  తాజాగా భారత్ 16 టన్నులకు పైగా వ్యాధి నిరోధక మందులను అఫ్గానిస్థాన్‌కు విరాళంగా అందించగా, తాలిబన్ ప్రతినిధి దీన్ని ప్రశంసించారు. 
 
“ఈ విరాళం అఫ్గానిస్థాన్‌కు భారతదేశం అందిస్తున్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని, అభివృద్ధి మద్దతును నొక్కి చెబుతోంది. ముఖ్యమైన వైద్య సామాగ్రిని అందిస్తూ మానవతా సహకారాన్ని ప్రోత్సహించడంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా తన పాత్రను పోషిస్తోంది” అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.
 
అలాగే ముత్తకీ తన భారత పర్యటన సమయంలో జమ్మూ కాశ్మీర్ పై భారత సార్వభౌమత్వాన్ని సమర్ధించారు. భారత గడ్డపై నిలబడే పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా పాక్-అఫ్గాన్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరిగే ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ సమయంలో భారత్- ఆఫ్ఘన్ సంబంధాలు మెరుగుపడటం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది.