నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్‌!

నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్‌!
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన సీఎంఎస్‌03 ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. సీఎంఎస్‌-03 సమాచార ఉపగ్రహం బరువు 4410 కిలోలు. ఇప్పటి వరకు భారత్‌ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో అన్నింటికంటే ఇదే అతిపెద్దది కావడం విశేషం.
దాదాపు అరగంటకుపైగా ప్రయోగించిన రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో చైర్మన్‌ వీ నారాయణన్‌ శాస్త్రవేత్తలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. విజయంలో కీలకపాత్ర పోషించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రయోగంతో భారత్‌ మరో ఘనత సాధించిందని తెలిపారు.

భారత నావికాదళం కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ మల్టీ-బ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచిఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఇస్రో నింగిలోకి పంపింది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగడంతో ఎల్‌వీఎం3 భారత్‌కు కీర్తిని తెచ్చిపెట్టిందని, నేడు అత్యంత బరువైన ఉపగ్రహాన్ని విజయవంతంగా మళ్లీ విజయాన్ని సాధించిందని నారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మిషన్ కోసం రాకెట్ పనితీరుతో పాటు పేలోడ్‌ సామర్థ్యాన్ని పెంచాల్సి వచ్చిందని చెప్పారు. ఈ శాటిలైట్‌ మల్టీబ్యాండ్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహమని, దాదాపు 15 సంవత్సరాలు సేవలు అందించేలా రూపొందించామని పేర్కొన్నారు. ఈ ఉపగ్రహం సరికొత్త సాంకేతిక టెక్నాలజీతో రూపొందించామని, ఆత్మనిర్భర్‌ భారత్‌కు అద్భుతమైన ఉదాహారణ అని.. ఆత్మనిర్భర్‌ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందని చెప్పారు.

ఇస్రో 4,410 కిలోల బరువున్న కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ‘సీఎంఎస్‌-03’ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నది. ఇందుకోసం 43.5మీటర్ల ఎత్తున్న ‘ఎల్‌వీఎం3-5’ రాకెట్‌ను ఉపయోగిస్తున్నది. ఇంత బరువైన శాటిలైట్‌ను భారత్‌ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది భారత భూభాగం సహా భూమిపై సముద్ర ప్రాంతాలకు సంబంధించి కీలక సమాచారాన్ని, బహుళ ప్రయోజనాలతో కూడిన వివిధ రకాల సేవలను సీఎంఎస్‌-03 అందించనున్నది. 

ఈ ఉపగ్రహాన్ని జీశాట్‌ 7ఆర్‌ అని పిలుస్తుంటారు. ఇది శాటిలైట్‌ను పూర్తిగా భారత సైన్యం అవసరాల కోసం తయారు చేసిన మల్టీ బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌. ఈ శాటిలైట్‌ 2013లో ప్రయోగించిన జీశాట్‌ 7 రుక్మిణి స్థానంలో సేవలు అందించనున్నది. అడ్వాన్స్‌డ్‌ పేలోడ్స్‌తో తయారు చేసిన ఈ శాటిలైట్‌ హిందూ మహాసముద్రంతో పాటు కీలక ప్రాంతాల్లో నేవీ కార్యకలాపాలు కొనసాగించే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నది. 

వాయిస్, డేటా, వీడియో లింక్‌ల కోసం సీ, ఎక్స్‌టెండెడ్ సీ, క్యూ-బ్యాండ్స్‌లో కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సైనిక అవసరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోని పౌర ఏజెన్సీలకు సైతం మెరుగైన డిజిటల్ సేవలు అందించడంలో జీశాట్‌ 7ఆర్‌ ఉపయోగపడనున్నది. ఇది మారుమూల ప్రాంతాలలో నేవీ డిజిటల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది, వ్యూహాత్మక అనువర్తనాలను బలోపేతం చేస్తుంది.

హిందూ మహాసముద్రంలో దేశ ప్రయోజనాలను రక్షించుకోవడంతోపాటు వ్యూహాత్మకంగా పైచేయి సాధించే లక్ష్యంతో భారత్‌ ఈ ప్రయోగం చేపట్టింది. సాగరంలో మోహరించిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నేల మీదున్న నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ ఉపగ్రహం తోడ్పాటు అందిస్తుంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళం కదలికలను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది.