జూబ్లీ హిల్స్ లో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి

జూబ్లీ హిల్స్ లో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి
డా. వడ్డీ విజయ సారధి,
`జాగృతి’ మాజీ సంపాదకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త
 

2024లో తెలంగాణ నుండి భాజపా లోకసభకు 8 స్థానాలు గెలవటం వెనుక దుబ్బాక, హుజూరాబాద్, ఉపాధ్యాయ ప్రతినిధుల ఎన్నిక ప్రభావం ఉంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాజపా 8 స్థానాలకే పరిమితం కావటం వెనుక మునుగోడు, పట్టభద్ర నియోజకవర్గంలలో ఓటమి ప్రభావం  ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి,  డా. గడ్డం వివేక్ గారి గురించి నేనేమీ వ్యాఖ్యానించాలని అనుకోవటం లేదు. రొట్టెకు ఎటువైపు వెన్న రాసి ఉందో వెతుక్కొంటూ పోవటం వారి స్వభావం.  శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి పార్టీ మారటం కోసం శాసన సభ్యత్వానికి రాజీనామా చేయటం, అప్పుడు జరిగిన ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిగా గెలుపొందలేకపోవటం అప్పటివరకు పొంగుమీద ఉన్న ఉత్సాహంపై నీరుచల్లింది.

భాజపా గెలుచుకొనడానికి అవకాశమున్న హైదరాబాద్ మహబూబ్ నగర్, పట్టభద్రుల నియోజకవర్గంలో అప్పటి వరకు శాసన మండలి సభ్యునిగా ఉన్న భాజపా అభ్యర్థి తన స్థానాన్ని కోల్పోవడము, వరంగల్, నల్గొండ స్థానంలో గెలుపొందలేక పోవటమూ, ఆపైన మునుగోడు పరాభవమూ -ఈ మూడు అంశాలు 2023 శాసనసభ ఎన్నికలపై ఊహాతీతమైన ప్రభావాన్ని చూపించాయి.

చిరకాలంగా పార్టీని అంటి పెట్టుకున్న వారందరూ పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఎవరూ పోలేదని ఆ పార్టీ నాయకులు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ ఉండవచ్చు గాక. కాని భాజపా అధికారంలోకి రాబోతున్నదనే ఆశతో సన్నిహితులైనవారు మరో తీరున నిర్ధారణకు వచ్చారు. దుబ్బాక హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలనుచూసి ఇకముందు నడిచే తీరుకు ఊహించుకొని, భవిష్యత్తు అంతా భాజపాదేనని  ఆశ పెట్టుకొని వచ్చినవారు ఈ ఫలితాలతో హతాశులైనారు.

భాజపా నాయకులు కార్యకర్తలు పోరాటానికి వెరిచేవారు కాదన్న మాట సందేహాతీతమే అయినా, గెలిచే తీరులో, గెలిచే వరకూ పోరాడటం వారికి తెలియదని నిర్ధారణకు వచ్చారు. భాజపావారు గెలుపు ఓటములు సమానంగా పరిగణించి సర్దుకుపోతుంటారని, వారితో కలిసి నడిస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వారు గ్రహించారు. కాబట్టి గెలిచి తీరాలనే పట్టుదలతో,(ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా, వాటివల్ల సంప్రాప్తించే నష్టం పెద్దగా లెక్కలోకి రాదని భావించుకొని) పనిచేసే పార్టీగా భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గార్ల పంచన చేరారు.

ఇలా  బిజేపికి సంభవించిన పార్శ్వ భంగం ఎటుపోవాలో ఇంకా నిర్ణయించుకోని బిఆర్ఎస్ వ్యతిరేకులైనవారిపై గట్టి ప్రభావాన్ని చూపించింది. అది శాసన సభ ఎన్నికలు ఫలితాలను నిర్దేశించింది. సాలు దొరా, ఇంకా సెలవు దొరా అంటూ నిర్మించుకొంటూ వచ్చిన వాతావరణాన్ని కాంగ్రెసు వారు నగదు చేసుకున్నారు. ఈ కొద్ది నేపధ్యాన్ని గుర్తు పెట్టుకొని ఆలోచిస్తే భాజపా అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తలు తమ కర్తవ్యం ఏమిటో గ్రహించగలరు.

వారు చేయాల్సిన మొదటి పని క్రిందటి ఎన్నికల్లో తమకు 25 వేల ఓట్లు రాగా దివంగత బిఆర్ ఎస్ అభ్యర్థికి 80 వేల ఓట్లు వచ్చినవే తప్పుడు లెక్కను తమ మనోఫలకం మీద నుండి తుడిచివేయు.  గోపీనాథ్ గారికి వచ్చిన వోట్లలో నుండి ఎం ఐ ఎం మద్దతుతో వచ్చిన ఓట్లను తీసివేయాలి. ఈ నియోజకవర్గంలో తమ బలం తాజాగా 2024 లోకసభ ఎన్నికల్లో సాధించిన 65 వేల ఓట్లు అని గుర్తు పెట్టుకోవాలి.
కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన 66 వేల కోట్లలో నెలనెలా 8500 రూపాయలు తమ బ్యాంక్ ఖాతాలో వచ్చి పడగలవన్న ఆశతో వేసిన వారు చాలామంది ఉన్నారని, వారు ఈసారి కాంగ్రెసుకు తమ వోటు వేసే ప్రసక్తే లేదని కూడా గ్రహించుకోవాలి.  తమ పత్రికలలోని స్థలాన్ని అంగుళాల లెక్కన అమ్ముకొంటున్న పత్రికలు, నిమిషాల లెక్కన అమ్ముకుంటున్న టీవీ చానళ్లు తమ అభ్యర్థికంటే కాంగ్రెసు, బిఆర్ఎస్ అభ్యర్థులు ముందు ఉన్నట్లుగా చూపిస్తున్నప్పటికీ వాటిని చూసి బెదిరిపోరాదు. 
తాము ప్రజల పక్షాన ఉన్నామని, ప్రజలు తమ పక్షాన నిలువగోరుతున్నారని వారి ఉత్సాహము, విశ్వాసమూ చెదరకుండా ఉండడానికి అవసరమైన మేరకు వాస్తవాలను వారికి గుర్తుచేస్తుండాలి.  తమ సానుభూతి పరులైన వారందరూ తప్పక వచ్చి ఓటు వేసేలా చూసుకోవాలి. అయోమయ స్థితిలో ఉన్నవారికి విషయాలను తెలియజెప్పి తమకు అనుకూలంగా మలుచుకోవాలి. ఈ స్థానం గెలవటమంటే అది దుబ్బాకలో గెలుపు వంటి ప్రభావాన్ని తెస్తుందని, ఇక్కడ విఫలం చెందటమంటే మునుగోడు వైఫల్యం వంటి దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని సోయికలిగి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.