 
                తమ క్లయింట్లకు ఇచ్చిన వృత్తిపరమైన సలహాలపై ప్రశ్నించడానికి న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. భారతీయ సాక్ష్యా అధినియం-2023 (బిఎస్ఎ)లోని సెక్షన్ 132లో పేర్కొన్న అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు సంస్థలు న్యాయవాదులను పిలిపించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
బిఎస్ఎలోని సెక్షన్ 132 ప్రకారం ఒక న్యాయవాది తన క్లయింట్ అనుమతి లేకుండా గోప్యమైన, వృత్తిపరమైన కమ్యూనికేషన్ సలహా లేదా పత్రాలను బహిర్గతం చేయమని ఒత్తిడి చేయకూడదు. అయితే ధర్మాసనం తరపున తీర్పు ఇచ్చిన జస్టిస్ చంద్రన్ ఈ ప్రత్యేక హక్కు సంపూర్ణమైనది కాదని, చట్టవిరుద్దమైన చర్యను లేదా నేరం లేదా మోసం జరిగినట్లు చూపించే సమాచార మార్పిడికి వర్తించదని పేర్కొన్నారు.
సెక్షన్ 132కింద న్యాయవాదులకు జారీ చేయబడిన సమన్లు మినహాయింపులను స్పష్టంగా ఇవ్వాలి. పోలీస్ సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వ్యక్తి పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదుల నుండి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ట్రయల్ కోర్టు ఎదుట హాజరుపరచాలి, కేసులో సంబంధిత పార్టీల సమక్షంలో మాత్రమే వాటిని తెరవాలని పేర్కొంది.
దర్యాప్తు సంస్థలు జారీ చేసే సమన్లు నిందితుల ప్రాథమిక హక్కులను, న్యాయవాదుల గోప్యతపై వారు ఉంచిన విశ్వాసాన్ని ఉల్లంఘించకూడదని పేర్కొంది. దర్యాప్తు సంస్థలు సీనియర్ న్యాయవాదులకు సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సిబిఎ),సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్ రికార్డ్ అసోసియేషన్ (ఎస్సిఎఒఆర్ఎ) ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్, విపిన్ నాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.





More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు