హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్‌ రాకెట్‌

హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్‌ రాకెట్‌

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌.. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఓ అరుదైన ఘనతను సాధించబోతున్నది. దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్‌ను తయారుచేసి ప్రయోగించబోతున్నది. వచ్చే 3 నెలల్లో ఈ భారత తొలి ప్రైవేట్‌, కమర్షియల్‌ రాకెట్‌ గగనతలంలోకి దూసుకుపోవచ్చని చెప్తున్నారు.  ప్రస్తుతం దేశీయంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాత్రమే ఈ తరహా ప్రయోగాలను చేస్తున్నది.

అయితే ఇక స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సైతం అందుకు వేదిక కాబోతుండటం గమనార్హం. ఇద్దరు మాజీ ఇస్రో శాస్త్రవేత్తల కంపెనీయే ఈ స్కైరూట్‌ ఏరోస్పేస్‌. వచ్చే ఏడాది జనవరిలో అంతరిక్ష్యంలోకి తమ తొలి పూర్తిస్థాయి శాటిలైట్‌ మిషన్‌ను పంపాలని స్కైరూట్‌ ప్రయత్నిస్తున్నది.  దీంతో భారతీయ అంతరిక్ష్య పరిశోధనా రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యానికి పునాదులు పడ్డట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, టీమ్‌సెక్‌, జీఐసీ వంటి ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్నారు. అయితే వచ్చే ఏడాది ప్రతీ 3 నెలలకోసారి ఒక ప్రయోగాన్ని చేపట్టాలని స్కైరూట్‌ యోచిస్తున్నది. ఈ క్రమంలోనే 2027కల్లా నెలకోసారి జరుపాలనుకుంటున్నామని చెప్తున్నది. ఒక్కో రాకెట్‌ నిర్మాణానికి దాదాపు 8-9 నెలల సమయం పడుతుందని, 2-3 మిలియన్‌ డాలర్ల ఖర్చు అవుతుందని స్కైరూట్‌ సీఈవో పవన్‌ చందన చెప్తున్నారు.

దేశ, విదేశీ కస్టమర్ల పేలోడ్స్‌తో ఒక్కో ప్రయోగం ద్వారా సుమారు 5 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అందుకోవచ్చని అంటున్నారు.  ఇక ప్రపంచవ్యాప్తంగా చిన్నపాటి శాటిలైట్ల ప్రయోగాలకు డిమాండ్‌ పెరుగుతున్నదంటున్న స్కైరూట్‌ తమ ప్రయోగాలతో మున్ముందు భారత, అంతర్జాతీయ క్లయింట్లకు మరింత చౌకగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నది.